విధాత: టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులను విచారించడానికి నాంపల్లి కోర్టు ఆదేశం ఇవ్వడంతో కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిలను చంచల్గూడ జైలులో ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కోర్టు నిర్దేశం మేరకు న్యాయవాది సమక్షంలో ఇరువురిని ప్రశ్నిస్తున్నారు.
జైలుకు లాప్ట్యాప్, మొబైల్, పెన్డ్రైవ్ అనుమతించారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందుతుల నుంచి కీలక సమాచారం రాబట్టలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. గత వారం సర్వీస్ కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిగా ఉన్న శంకరలక్ష్మిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.
ఈ విచారణలో కొంతవరకు సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసులో మనీలాండరింగ్కు పాల్పడినట్టు అనుమానిస్తున్న ఈడీ అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు, రేపు చంచల్గూడ జైలులోనే వారిద్దరి వాంగ్మూలాల్ని నమోదు చేయనున్నారు. ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ముందుకు వెళ్లనున్నట్టు సమాచారం.
సిట్ నుంచి వివరాలను ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వడం కుదరదని సిట్ అధికారులు తేల్చిచెప్పడంతో ఈడీ నాంపల్లి కోర్టును ఆశ్రయించింది.
అలాగే ఈ కేసులో ప్రధాన నిందితులను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయడంతో దానికి అనుమతించిన నాంపల్లి కోర్టు చంచల్గూడ్ జైలులోరిమాండ్ ఖైదీలుగా ఉన్నవారిని అక్కడే విచారించాలని పేర్కొన్నది. అలాగే జైలు అధికారులు కూడా దీనికి సహకరించాలని ఆదేశించింది. చంచల్గూడ జైలు అధికారి ఆఫీసులో వీరిద్దరిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ కేసులో నిందుతులైన ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిలు ఎవరెవరికి ప్రశ్నపత్రాలు విక్రయించారు? ఎంతమొత్తం వాళ్ల నుంచి వసూలు చేశారనే అంశాలపై ఈడీ అదికారులు దృష్టి సారించారు. ఈ కేసులో ఇప్పటికే 17మంది సిట్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ఈడీ ఎలాంటి విచారణ చేయబోతున్నది? ఈ కేసులో సిట్ అరెస్టు చేసిన వారందరినీ విచారిస్తుందా? ఎలా ముందుకు వెళ్తుందనేది వేచిచూడాల్సి ఉన్నది. ప్రధానంగా ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిలు ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగానే ఈడీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.