(Farmers)
విధాత: అక్కడి చెరుకు తోటల్లో ఎలుగుబంట్లు కనిపిస్తాయి. అయితే, అవి నిజమైనవి కావు.. ఎలుగుబంట్ల వేషాధారణలో ఉన్న మనుషులే. పంటలను ధ్వంసం చేస్తున్న కోతుల నుంచి తప్పించుకొనేందుకు రైతులే ఎలుగుబంట్ల వేషాలు వేయాల్సి వస్తున్నది. ఇది ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లా జహాన్ నగర్ గ్రామంలో జరుగుతున్నది.
జహాన్ నగర్ ప్రాంతంలో 40-45 కోతులు సంచరిస్తూ పంటలను పాడు చేస్తున్నాయి. ముఖ్యంగా చెరుకు పంటలను చేతికి అందకుండా చేస్తున్నాయి. కోతుల బెడద నుంచి కాపాడాలని అధికారులకు రైతులు విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో రైతులే ఒక ఉపాయం ఆలోచించారు. కోతుల మందలు పంటలను దెబ్బతీయకుండా ఎలుగుబంటి దుస్తులు వేసుకొని ఎలుగు వలె పంటల మధ్యలో కూర్చొవడం మొదలుపెట్టారు.
దాంతో కోతులు ఎలుగుబంటి ఉందనుకొని అక్కడి నుంచి పరారవుతున్నాయి. తమ పంటలను కాపాడుకోవడానికి రూ.4000 వెచ్చించి ఎలుగుబంటి దుస్తులు కొన్నామని ఓ రైతు గజేందర్సింగ్ తెలిపారు. కోతులను తరిమికొట్టేందుకు రైతులు తమ పొలాల్లో ఎలుగుబంటి తరహా కూర్చున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.