దేశవ్యాప్తంగా అనేక నగరాలను దట్టమైన పొగమంచు కమ్మేడంతో ఆ ప్రభావం విమాన ప్రయాణాలపై పడింది. ఉదయం వేళల్లో అనేక విమాన ప్రయాణాలు రద్దయ్యాయి
విధాత: దేశవ్యాప్తంగా అనేక నగరాలను దట్టమైన పొగమంచు కమ్మేడంతో ఆ ప్రభావం విమాన ప్రయాణాలపై పడింది. ఉదయం వేళల్లో అనేక విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ సున్నాకి పడిపోవడంతో సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు తమ విమానాల గురించిన అప్డేట్ల కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని అధికారులు సూచించారు.
భారత వాతావరణ విభాగం సమాచారం ప్రకారం.. ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. రాజధానిలో విజిబులిటీ 125 మీటర్లకు పడిపోయింది. 125 మీటర్ల దూరం అవతల ఏమున్నదో కనిపించనంత దట్టం పొగమంచు కమ్ముకున్నది. దీంతో రోజువారీ ప్రజల జీవన కార్యకలాపాలకు తీవ్ర ఆటంటం ఏర్పడుతున్నది. రహదారులపై ప్రయాణం అత్యంత కష్టతరంగా మారింది. నెమ్మదిగా లైట్లు వేసుకొని వాహనదారులు ప్రయాణాలు సాగిస్తున్నారు.
దేశ రాజధానిలో గాలి నాణ్యత సోమవారం ‘చాలా పేలవమైన’ క్యాటగిరి చేరింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డాటా ప్రకారం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) దాదాపు 400కి చేరుకున్నది. విస్తారా సంస్థ అనేక విమానాలను మళ్లిస్తున్నట్టు ప్రకటించడంతో దక్షిణ భారతదేశంలో కూడా విమాన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. పొగమంచు కారణంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఆరు విమానాలను దారి మళ్లించారు.
వాస్తవానికి బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన UK897 విమానం, హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి బెంగళూరుకు దారి మళ్లించబడింది. ముంబై నుంచి హైదరాబాద్కు బయలుదేరిన UK873 విమానం కూడా ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీకి వెళ్లే మార్గంలో కనీసం 11 విమానాలు ఆలస్యం అవుతున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది.