ఏపీ రాజకీయాల్లో కుటుంబాలు
విధాత, విజయవాడ: త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు పలు సిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. 2024-రాష్ట్ర రాజకీయాలు మొత్తం రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి. అందులోనూ 2 జాతీయ పార్టీలు.. 2 ప్రాంతీయ పార్టీల పగ్గాలు కేవలం 2 కుటుంబాల చేతుల్లోనే ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల నేతలే ఆయా పార్టీలకు అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార వైసీపీకి అధినేతగా కొనసాగుతున్నారు. అన్నీతానై పార్టీని బలంగా నిర్మించి ముందుకు తీసుకుపోతున్నారు. మరోవైపు ఇటీవల ఏపీ పీసీసీ అధ్యక్ష పగ్గాలను వైఎస్ షర్మిలా రెడ్డికి అప్పగిస్తూ ఏఐసీసీ ప్రకటించింది. తెలంగాణలో ఆమె స్థాపించిన వైఎస్సార్టీపీ పార్టీని విలీనం చేసి, ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ లో చేరిన షర్మిలా రెడ్డి.. ఆ తర్వాత 10 రోజుల్లోనే ఏపీ అధ్యక్షురాలు అయిపోయారు. అన్నాచెల్లెలు జగన్, షర్మిల ఇద్దరూ.. ఒకరు జాతీయ పార్టీ కాంగ్రెస్, మరొకరు ప్రాంతీయ పార్టీ వైసీపీని శాసిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతానం.
పురంధేశ్వరి.. స్వయానా చంద్రబాబుకు వదిన వరస
మరో జాతీయ పార్టీ.. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె రాష్ట్రం మొత్తం తిరుగుతూ బీజేపీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ వారసత్వంతో పాటు స్వతహాగా అబ్బిన ప్రతిభా పాటవాలు ఆమె సొంతం. స్వయానా చంద్రబాబుకు వరసకు వదిన అయిన పురంధేశ్వరి ఊహించని రీతితో రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టారు. మరో పార్టీ టీడీపీ… జాతీయ పార్టీగా ప్రకటించుకున్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే తన ప్రాబల్యాన్ని చాటుతోంది. 70 ఏళ్ల పైబడ్డ వయస్సులోనూ నారా చంద్రబాబు నాయుడు పార్టీ అధినేతగా సక్సెస్ అయ్యారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆయన రాజకీయ ప్రయాణంపైనే ఇప్పటికీ తెలుగు తమ్ముళ్లు నమ్మకాలు పెట్టుకున్నారు. పార్టీ పని అయిపోయింది అనుకున్న ప్రతీ సారీ టీడీపీ తిరిగి నిలదొక్కుకుంది అంటే అది నమ్మకమైన పసుపు సైనికులు, చంద్రబాబు రాజకీయ వ్యూహాల వల్లే అంటారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు కూతురు. ఈమె చెల్లెలు భువనేశ్వరిని చంద్రబాబు వివాహమాడారు. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గ నేతలు కాగా, బీజేపీ, టీడీపీ పగ్గాలు చేపట్టారు.
ఎన్నడూ చూడని రాజకీయ దృశ్యం
2 జాతీయ.. 2 ప్రాంతీయ పార్టీల అధ్యక్ష పదవులు రెండు కుటుంబాల చేతుల్లోనే ఉండగా.. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మొత్తం ఈ రెండు కుటుంబాల చుట్టూనే నడుస్తున్నాయి. ఏపీలో ఎన్నడూ చూడని రాజకీయ దృశ్యంగా పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్.. పార్టీని స్థాపించడానికి ముందు కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించారు. సొంత పార్టీ వైసీపీని నిర్మించి అధికారంలోకి వచ్చారు. ఏకంగా 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజార్టీ తో 2019 ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. బలమైన ప్రాంతీయ పార్టీకి ఆయన అధ్యక్షుడు. త్వరలో జరగబోయే ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు మరోసారి సిద్ధమయ్యారు. వై నాట్ 175 నినాదాన్ని తెరపైకి తెచ్చి.. మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ పేరు.. వైఎస్ షర్మిలా రెడ్డి
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ట్రెండింగ్ పేరు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని కోల్పోయింది. ఇప్పడు ఆపార్టీకి ఊపిరి పోసేందుకు వైఎస్ షర్మిలా రెడ్డి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టే ఎన్నికల పోరును ఆమె భుజస్కంధాలపై వేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానం ఉన్న నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ తో ఇమడ లేక పోతున్న వైసీపీ నాయకులకు పార్టీ నుండి బయటకు రావడానికి ఒక మార్గంగా షర్మిల కనిపిస్తున్నారు. ఈ రాజకీయ పరిణామాలను అంచనా వేసిన కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను రంగంలోకి దించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆమెకు అదనపు బలం. ఆ వర్గం కాంగ్రెస్ కు ముందు నుండీ అండగా ఉంటూ వస్తోంది. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి మరో రెండు రోజుల్లో అడుగుపెట్టబోతుండగా.. కాంగ్రెస్ లోకి పెద్దఎత్తున వలసలు ఉంటాయని ఆపార్టీలో చర్చజరుగుతోంది.
బాబుకు నమ్మకమైన తోడు పవన్ కళ్యాణ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 70 ఏళ్ల పైబడ్డ వయస్సులో స్కిల్ స్కాంలో రిమాండ్ కు వెళ్లి వచ్చారు. వైసీపీ దుందుడుకు చర్యతో ప్రజల్లో టీడీపీకి వచ్చిన సానుభూతిని ఓట్ల రూపంలో మార్చుకునే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఇప్పటికీ ఆయన పైనే తెలుగు తమ్ముళ్లు నమ్మకాలు పెట్టుకున్నారు. కుమారుడు లోకేష్ ఒకవైపు అండగా ఉండగా… మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నమ్మకమైన తోడుగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిపోరుకు టీడీపీ-జనసేన సిద్ధమైంది.
సొంతంగా బలపడని బీజేపీ
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎలాగైనా సొంతంగా బలపడాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ ప్రయత్నంలో నేతల ఆశలు ఎప్పుడూ దెబ్బ తింటూనే ఉన్నాయి. ఏరి కోరి తెచ్చుకున్న నాయకులు పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగపడలేదన్న అభిప్రాయం ఆపార్టీ నేతల్లోనే ఉంది. ఈపరిస్థితుల్లో ఆంద్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టిపెట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఎట్టకేలకు పురంధేశ్వరిని రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఈక్రమంలోనే ఆమె పార్టీ అధ్యక్షురాలు అయ్యారు. అందుకు తగ్గట్టుగానే ఆమె రాష్ట్రం మొత్తం తిరుగుతూ బీజీపీనీ క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. స్వయానా చంద్రబాబుకు వరసకు వదిన అయిన పురంధేశ్వరి.. ఒకవేళ బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య ఎన్నికల పొత్తు ఏర్పడితే కీలకపాత్ర పోషించబోతున్నారు.