ఫోక్స్ కాన్ ప్రతినిధులకు సీఎం రేవంత్రెడ్డి భరోసా
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, మౌలిక సదుపాయల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు

- పారిశ్రామిక ప్రగతికి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
విధాత, హైద్రాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, మౌలిక సదుపాయల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ఫాక్సాకాన్ కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఐటీ మంత్రి డి.శ్రీధర్బాబు, సీఎస్ శాంతికుమారి, ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు. పారిశ్రామిక వేత్తలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన అన్ని అనుమతులు సులభంగా అందించడంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం రేవంత్రెడ్డి భరోసానిచ్చారు.
అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తు ముందుకెలుతామన్నారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్దిని మరింత వేగవంతం చేస్తామన్నారు. కొంగర కలాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని, ఫాక్సాకాన్ సంస్థ చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామన్నారు.

కాగా తెలంగాణ ప్రభుత్వంతో మార్చి 2023లో ఫాక్సాకాన్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫాక్సాకాన్ సంస్థ ప్రధానంగా ఆపిల్ ఐఫోన్లను ప్రధానంగా తయారుచేస్తుంది. ఫాక్సాకాన్ సంస్థ ప్రధాన కస్టమర్లలో గూగుల్, షియామి, అమేజాన్, హవాయి, డెల్, ఫెస్బుక్, మైక్రోసాఫ్ట్, సోనీ, నోకియా వంటి సంస్థ్లున్నాయి. చైనా, వియత్నాం, థాయ్లాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాలలో ఫాక్సాకాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది.
మన దేశంలో శ్రీసిటి (ఎపి), శ్రీపెరంబుదూర్ (తమిళనాడు), తెలంగాణ (కొంగరకలాన్) మరియు కర్ణాటక (బెంగళూరు సమీపంలో) సంస్థ పనిచేస్తున్నది. ఫాక్సాకాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ తయారుచేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా 1,00,000 ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (ఎంవోయు)పై సంతకం చేసింది. మొదటి దశలో, వచ్చే రెండేళ్లలో 25,000 ఉద్యోగాలు కల్పించనున్నారు.