100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: సీఎం
మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను సీఎంకు అధికారులు వివరించారు.

హైదరాబాద్, సెప్టెంబర్8(విధాత): మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను సీఎంకు అధికారులు వివరించారు.
100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. పూర్తిగా సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు ఉండాలని సీఎం పేర్కొన్నారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ఏరియాలవారీగా చెక్ డ్యామ్ ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో మేడారంకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తానన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.
అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్ను గౌరవించడంతోపాటు, స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.