విధాత: ఆంగ్ల నామ నూతన సంవత్సరం జనవరి ఒకటి, ఆదివారం సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో ప్రజలు సందర్శనకు రావడంతో ఆలయాలు కిటకిటలాడాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శ్రీ మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం, వాడపల్లి అగస్తేశ్వరాలయం తోపాటు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో నూతన సంవత్సరం వేళ భక్తుల రద్దీ కొనసాగింది.
యాదాద్రి పుణ్యక్షేత్రంలో సాధారణ దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టగా, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల వరకు సమయం పట్టింది, భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు లక్ష్మీ నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రేపు సోమవారం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో శ్రీమహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనానికి నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం పిదప వచ్చిన తొలి ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర గోపుర మార్గం ద్వారా ఉదయం 6:48 గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు.
ఇందుకోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఈఓ గీతా తెలిపారు. రేపటి నుంచి ఆరు రోజులపాటు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఈవో పేర్కొన్నారు.