Adilabad ఆందోళనలో లోతట్టు ప్రాంతాల ప్రజలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండగా పలు వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి . ఎగువ ప్రాంతంలో కూసిన భారీ వర్షాలకు పలు వాగులు ఉదృతంగా ప్రవహించడంతో తాత్కాలిక వంతెనలు కొట్టుకపోయి, లో లెవెల్ వంతెనల పై వరద ఉదృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇందులో ప్రధానంగా ఆదిలాబాద్ , […]
Adilabad
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండగా పలు వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి . ఎగువ ప్రాంతంలో కూసిన భారీ వర్షాలకు పలు వాగులు ఉదృతంగా ప్రవహించడంతో తాత్కాలిక వంతెనలు కొట్టుకపోయి, లో లెవెల్ వంతెనల పై వరద ఉదృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇందులో ప్రధానంగా ఆదిలాబాద్ , కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు ఉదృతంగా ప్రవహించడంతో వ్యవసాయ పనులకు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
తాత్కాలిక వంతెనలు కొట్టుకపోవడంతో ఇతర ప్రాంతాల నుండి గమ్యస్థానాలకు చేరుకోవాలంటే 10 నుండి 20 కిలోమీటర్ల అదనపు దూరంతో ప్రయాణించవలసి వస్తుంది. చుట్టూ వాగులు ఉధృతంగా ప్రవహించడం తో నిత్యవసర సరుకులు తెచ్చుకోవడానికి పట్టణాలకు వెళ్లవలసిన అవసరాన్ని సైతం వాయిదా వేసుకుంటున్నారు.
అదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం తార్ణం బ్రిడ్జి కుంగిపోవడంతో దాని రిపేర్ లో భాగంగా పక్కనే చిన్న తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయగా, అది కూడా వరదకు కొట్టుకపోగా ప్రజల రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని ఇతర గ్రామాలతో అనుసంధానం లేకుండా పోయింది. బెజ్జూర్ మండలంలో తీగల ఒర్రె, సిద్ధపూర్, కుశ్నపల్లి వాగులు పొంగి పొర్లుతున్నాయి. చింతలమానెపల్లి మండలంలో దిందా కేతిని, డబ్బా బాబాసాగర్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రతీ ఏడాది వర్షాకాలం కొన్ని రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ గడపాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
సలుగుపల్లి తీగల ఒర్రె, దిందా కేతిని గ్రామాల మధ్య ఉన్న లో లెవల్ వంతెనపై వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ప్రమాదకరంగా మారి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతి ఏటా ఇక్కడ హై లెవెల్ వంతెన నిర్మించాలని గ్రామస్థులు పాలకులను, అధికారులను కోరుతున్నా పట్టించుకోకపోవడంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడి సమస్యలకు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
బాబాసాగర్ వద్ద వాగుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో నాయకపు వాడ ప్రజలు చిన్న పాటి వర్షాలకే వాగు దాటలేకపోతున్నారు. ఎక్కువ వర్షాలు వస్తే తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని అక్కడి గ్రామస్థులు తెలిపారు .
గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి మధ్యలో ఉన్న ఓర్రెలు, వాగులు, వంకలపై వంతెనలు నిర్మించకపోవడం వల్లే వర్షాకాలం వచ్చిందంటే ఒకవైపు సాగు కోణంలో ఆనందం, రాకపోకల అంతరాయంతో ఆందోళన చెందాల్సివస్తుందని వాపోతున్నారు.
ఉపరితల వర్తనంతో మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలపడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు .గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి వాగులపై పటిష్టమైన బ్రిడ్జిలు ఏర్పాటు చేసినట్లయితే రవాణా వ్యవస్థ మెరుగుపడి వర్షాకాలంలో రాకపోకల ఇబ్బందులు తప్పుతాయని స్థానికులు కోరుతున్నారు.