Vande Bharat | వందే భారత్‌ స్పీడ్‌కు ‘కవచ్‌’ బ్రేక్‌..! ఆగ్రా డివిజన్‌ ట్రయల్స్‌ విజయవంతం..!

రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోకుండా దేశంలోనే రూపొందించిన వ్యవస్థ కవచ్‌. ఈ యాంటీ కొలిజన్‌ డివైజ్‌ కవచ్‌ను భారత్‌లోనే రూపొందించారు

Vande Bharat | వందే భారత్‌ స్పీడ్‌కు ‘కవచ్‌’ బ్రేక్‌..! ఆగ్రా డివిజన్‌ ట్రయల్స్‌ విజయవంతం..!

Vande Bharat | రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోకుండా దేశంలోనే రూపొందించిన వ్యవస్థ కవచ్‌. ఈ యాంటీ కొలిజన్‌ డివైజ్‌ కవచ్‌ను భారత్‌లోనే రూపొందించారు. రీసెర్చ్‌ డిజైన్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డీఎస్‌వో) సంస్థ తయారు చేసింది. ఈ కవచ్‌ డివైజ్‌ను వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై విజయవంతంగా పరీక్షించారు. ఆగ్రా రైల్వే డివిజన్‌లో దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్‌ ట్రయల్స్‌ చేపట్టింది. ఎనిమిది కోచ్‌ల వందేభారత్ రైళ్లలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించామని.. మొదటి ట్రయల్‌లో, లోకో పైలట్ బ్రేకులు వేయలేదని.. 160 కిలో మీటర్ల వేగంతో నడుస్తున్న రైలు రెడ్‌ సిగ్నల్‌కు పది మీటర్ల ముందు ఆటోమేటిక్‌గా ఆగిపోయిందని అధికారులు తెలిపారు.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, పాల్వాల్‌ మధ్య పరీక్ష జరిగిందని, ట్రయల్స్‌ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా నడుస్తున్న ఎనిమిది కోచ్‌ల వందేభారత్ రైళ్లకు ఇప్పుడు తప్పనిసరి చేసినట్లు ఆగ్రా రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు. అన్ని వందే భారత్ రైళ్లలో ఆర్మేచర్ సిస్టమ్ అమర్చనున్నట్లు పేర్కొన్న ఆయన.. ఏ కారణం చేతనైనా లోకో పైలట్ రైలును నియంత్రించడంలో విఫలమైతే.. ఆటోమేటిక్‌గా బ్రేకులు వేసే వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. వ్యవస్థకు స్టేషన్‌ కవచ్‌, పట్టాల వెంబడి ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు, కవచ్‌ టవర్లు అవసరం కాగా.. వీటిని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తున్నది.


ప్రస్తుతం ఎనిమిది కోచ్‌ల వందేభారత్‌పై కవచ్‌ టెస్ట్‌ నిర్వహించగా.. త్వరలోనే 16 కోచ్‌ల సెమీ హైస్పీడ్‌ రైళుపై పరీక్షించనున్నట్లు ప్రశస్తి శ్రీవాస్తవ పేర్కొన్నారు. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ డిప్యూటీ చీఫ్ సిగ్నల్ ఇంజినీర్ కుష్ గుప్తా పర్యవేక్షణలో ట్రయల్స్‌ జరిగాయన్నారు. గుప్తా పర్యవేక్షణలో ఆగ్రా డివిజన్ 140 కిలోమీటర్లు, 160 కిలోమీటర్ల వేగంతో ఇతర మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సైతం కవచ్‌ టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించింది.


ఆగ్రా డివిజన్ మధుర (స్టేషన్ మినహా), పాల్వాల్ మధ్య 80 కిలోమీటర్ల దూరం వరకు పూర్తి కవచ నెట్‌వర్క్‌ను రైల్వేశాఖ అభివృద్ధి చేసింది. స్టేషన్ ప్రాంతాలు, ఇతర ప్రదేశాలలో రైల్వే ట్రాక్‌లపై ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను ఉంచడం, స్టేషన్‌ల వంటి బహుళ ప్రదేశాల్లో స్టాటిక్ ఆర్మర్ యూనిట్‌లను ఇన్‌స్టాల్ చేయడం, ట్రాక్‌ల వెంట టవర్లు, యాంటెన్నాలను కవచ్‌ వ్యవస్థలో భాగంగా అమరుస్తారు. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) అభివృద్ధి చేయబడిన కవాచ్ సిస్టమ్, రైలు డ్రైవర్ సకాలంలో స్పందించడంలో విఫలమైనప్పుడు అత్యవసర సమయంలో స్వయంచాలకంగా బ్రేక్‌లను వేస్తుంది.


ఆర్‌డీఎస్‌వో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ, ఆగ్రా మధ్య మూడు స్ట్రెచ్‌లలో 125 కిలోమీటర్లు సాగిన రైలు నెట్‌వర్క్‌లో గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడపగల స్ట్రచ్‌ ఉన్నది. భారతదేశంలోని అన్ని ఇతర విభాగాల్లో రైళ్లు గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఏప్రిల్ 2016లో ప్రారంభించబడిన భారతదేశపు సెమీ-హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ను నిర్మించారు.