Ktr | తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలివే

Ktr | ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు సబ్‌ కమిటీ ఏర్పాటు, అసెంబ్లీలో బిల్లు దాసోజు, కుర్రసత్యనారాయణలకు ఎమ్మెల్సీ వరదలకు తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు విద్యుత్‌ వీరులకు 15న సత్కారం మెట్రో విస్తరణ క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కేటీఆర్ విధాత: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన […]

  • Publish Date - July 31, 2023 / 04:54 PM IST

Ktr |

  • ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం
  • ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు
  • సబ్‌ కమిటీ ఏర్పాటు, అసెంబ్లీలో బిల్లు
  • దాసోజు, కుర్రసత్యనారాయణలకు ఎమ్మెల్సీ
  • వరదలకు తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు
  • విద్యుత్‌ వీరులకు 15న సత్కారం
  • మెట్రో విస్తరణ
  • క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కేటీఆర్

విధాత: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆర్టీసీలో పని చేస్తున్న43, 373 వేలమంది ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలు రూపొందించడానికి కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.

సోమవారం సచివాలయంలో కేబినెట్‌ కమిటీ సమావేశం జరిగింది. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌ సమావేశం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్‌ మీడియాకు వెల్లడించారు. ఈనెల 3వ తేదీ నుంచి జరిగే శాసన సభ సమావేశాలలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులను ఉద్యోగులుగా పరిగణించే బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు.

తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల

రైతులు, హైదరాబాద్, వరంగల్ అభివృద్ధి పై క్యాబినెట్ లో పలు నిర్ణయాలు తీసుకున్నామని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన వరద నష్టంపై క్యాబినెట్ లో చర్చించామన్నారు. ఈ మేరకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించామన్నారు.

వరదల వల్ల దెబ్బ తిన్న రోడ్ల కు వెంటనే తాత్కాలిక మరమత్తులు నిర్వహించి రవాణ సదుపాయం పునరుద్దరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మున్నేరు వాగు వెంట రిటైనింగ్ వాల్ నిర్మించాలని నిర్ణయించామన్నారు. వర్షాలు, వరదలు పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను కోరారు.

పంట నష్టం పై పూర్తి నివేదిక అందాక నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రం కూడా రాజకీయం చేసుడు బంద్ చేసి, సహాయం చేయాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

భారీగా మెట్రో విస్తరణ

మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్‌ మెట్రో వ్యవస్థను భారీగా విస్తరించాలని రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్‌ తెలిపారు. రాయదుర్గంనుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు, మెట్రో రైలు టెండర్‌ ప్రక్రియ జరుగుతున్నదన్నారు.

ఇస్నాపూర్‌ నుంచి మియాపూర్‌ వరకు , మియాపూర్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు, ఎల్బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు, ఉప్పల్‌ నుంచి బీబీనగర్, ఉప్పల్ నుంచి ఈసీఎల్ క్రాస్ రోడ్డు వరకు, ఎయిర్ పోర్టు నుండి కందుకూరు వరకు, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు మెట్రో విస్తరణ మెట్రో విస్తరణకు

కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్‌నగర్‌ వరకు మెట్రో విస్తరణ చేపడుతామన్నారు. అలాగే జేబీఎస్‌ నుంచి తూంకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ ప్లై ఓవర్ నిర్మాణం చేపడుతామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

గోవా తరహాలో.. హకింపేట ఎయిర్‌పోర్ట్‌ సేవలు

వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టుకు అదనపు భూమి 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ కు మరో ఎయిర్ పోర్టు అవసరం ఉందన్నారు. ఈ మేరకు హకీంపేట ఎయిర్ పోర్టును గోవా తరహాలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు చేయాలని నిర్ణయించామని కేటీఆర్‌ తెలిపారు.

తిప్పి పంపిన బిల్లులపై మళ్లీ తీర్మాణం

గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ సమావేశాలలో తిరిగి తీర్మానం చేసి పంపుతామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండోసారి తీర్మానం చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు గా ఎస్టీల నుంచి కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రావణ్ ల పేర్లను ప్రతిపాదిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసిందన్నారు. ఈ మేరకు తీర్మాణం ప్రతిని గవర్నర్‌కు పంపిస్తామన్నారు.

రాష్ట్రంలో మురో 8 మెడికల్‌ కాలేజీలు

విద్యుత్ వీరులకు 15 ఆగస్టున సత్కారం చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని కేటీఆర్‌ తెలిపారు. అలాగే రాష్ట్రంలో మరొక 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.