విధాత, హైదరాబాద్ : టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతోపాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎక్స్ వేదికగా హెచ్చరించారు. కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో కావాలనే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కావాలని కొన్ని మీడియా సంస్థలు, కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామన్నారు. గత కొన్ని నెలలుగా విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది మీడియా సంస్థల యజమానులు నా పైన వ్యక్తిగతంగానూ, మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపైన విషం చిమ్ముతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అలాంటి వ్యక్తుల వల్ల, వారు వ్యక్తపరుస్తున్న నీచమైన అభిప్రాయాలు నాపైన వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపించబోవన్నారు.
కానీ పదేపదే వీరు చేస్తున్న వ్యక్తిత్వ హననం వలన మా కుటుంబ సభ్యుల పైన తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తున్నాయన్నారు. మీడియా రూపంలో వీరు చేస్తున్న దాడులు నా శ్రేయోభిలాషులకు, పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు బాధ కలిగిస్తున్నాయని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వార్తల ముసుగులో నాపై దుష్ఫ్రచారం చేస్తున్న ఒక్కొక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానన్నారు. నాపై దుష్ప్రచారాన్ని కలిసికట్టుగా వెనుక ఉండి నడిపిస్తున్న వారితోపాటు, దుర్మార్గపూరితంగా ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన రీతిలో చట్టపరంగా ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.