విధాత : తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది.ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో సీఎం రేవంత్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడే వారికి స్థానిక ఎన్నికల్లో గుర్తింపు దక్కుతుందని కేడర్ను ఉద్ధేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4వ తేదీన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడగానే అదే నెలలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలను కూడా పూర్తి చేసి ఎన్నికల హడావుడి నుంచి త్వరగా బయటపడి పాలనపై సీరియస్గా దృష్టి పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నారు. జూన్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికలు పూర్తి చేయడంతో పాటు సహకార, చేనేత సంఘాల ఎన్నికలు కూడా పూర్తి చేస్తే ఎన్నికల మూడ్ నుంచి పూర్తిగా బయటపడి అభివృద్ధి పనులు, హామీల అమలుపై పూర్తి స్థాయిలో పనిచేయవచ్చన్నది రేవంత్ ఆలోచనగా కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తే సమీప భవిష్యత్తులో ఇక ఏ ఎన్నికలు ఉండవని అందుకే జూన్ నెలలోనే స్థానిక ఎన్నికల నిర్వాహణ పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం.