విధాత : బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల గ్రామంలో రెండు ఎకరాల భూమిని కబ్జా కేసులో కన్నారావుకు మంగళవారం నోటీసులు పంపించారు. ప్రస్తుతం కన్నారావు సింగపూర్లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ భూ కబ్జాలో కీలక పాత్ర పోషించిన 38 నుండి నిందితుల్లో 10 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు భూ కబ్జా, హత్యాయత్నం ఆరోపణలతో తనపై అదిభట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులకు కొట్టివేయాలంటూ కన్నారావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మరో భూ కబ్జా కేసులో మాజీ ఎంపీ సంతోష్రావు పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్–14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనపై వచ్చిన ఆరోపణలు సంతోష్రావు ఖండించారు.