Mancherial |
విధాత, ఆదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల (Mancherial) జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డుపైన ఓ మహిళ నడుచుకుంటూ వెళుతున్న నేపథ్యంలో బైక్ పైన ఆమె వెనుకే వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు కత్తి తీసి మహిళా మెడపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో మెడ భాగం కట్ కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి మహిళా అక్కడికక్కడే మృతి చెందింది.
మహిళపై అందరు చూస్తుండగానే దాడి చేసి అగంతకులు అక్కడి నుండి అదే బైక్ పై పారిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. చనిపోయిన మహిళ మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్కు చెందిన స్వప్న శ్రీ అని సమాచారం పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. పూర్తి వివరాలు పోలీస్ విచారణలో తేలలున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని నిరుపేద దళితుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కూలీలుగా ఉన్న వారిని భూ యజమానులుగా మార్చడానికి ప్రభుత్వం దళిత బస్తి కింద మూడెకరాల భూమిని కేటాయిస్తే ఆ భూమి వివాదం కాస్త నిండు ప్రాణాన్ని బలిగొంది.
మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ లో మృతురాలు స్వప్న (35) మూడో పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది. స్వప్న మొదటి భర్త చనిపోవడంతో ఆమె కోటపల్లి మండలం వెంచపల్లికి చెందిన వేల్పుల మధు అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. కొన్నాళ్లు కాపురం సజావుగా సాగినప్పటికీ మనస్పర్ధలు వచ్చి ఇద్దరు విడిపోయారు. వేల్పుల మధును పెళ్లి చేసుకున్న తర్వాత అదే గ్రామంలో మధు భార్య పేరిట దళిత బస్తీ కింద మూడు ఎకరాల భూమి ప్రభుత్వం ఇచ్చింది.
ఆ మూడెకరాల భూమి స్వప్న పేరిట రిజిస్ట్రేషన్ అయింది. ఆ భూమి నా మూలంగానే నీకు సంక్రమించిందని ఆ భూమిని నా పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని రెండో భర్త మధు మృతురాలు స్వప్నకు మధ్య వివాదం కొనసాగుతుంది. మృతురాలు స్వప్న తన పేరిట ఉన్న భూమిని నీకు ఇచ్చే ప్రసక్తి లేదని ఖరాకండిగా చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరి హత్య కు దారి తీసిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
వివాదం నేపథ్యంలో మృత్యురాలి రెండో భర్త వేల్పుల మధు అతని తండ్రి, తమ్ముడు ముగ్గురు కలిసి ఒకే బైక్ పై వచ్చి మున్సిపల్ ఆఫీస్ నుంచి స్వప్న బయటకి వెళ్లి రోడ్డుపై నడుస్తుండగా ఒకేసారి కత్తితో దాడి చేయడంతో మెడ నరాలు పూర్తిగా తెగిపోయి స్వప్న అక్కడికక్కడే మృతి చెందింది. అందరూ చూస్తుండగానే కత్తితో స్వప్నను హత్య చేసి ముగ్గురు నిందితులు కోటపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.
మున్సిపల్ కార్యాలయం ముందు హత్య జరిగిన సమాచారం తెలుసుకున్న ఏసీపీ తిరుపతిరెడ్డి సిఐ రాజు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. మృతురాలి చెల్లెలి ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో ఈ మధ్యకాలంలో జనం చూస్తుండగానే హత్యలు చేయడం పరిపాటిగా మారిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో విభేదాలు, విద్వేషాలు, అలాగే అక్రమ సంబంధాల నేపథ్యంలో హత్యలు చేయడం లాంటి ఘటనలు జిల్లాలో ఏదో ప్రాంతంలో చోటుచేసుకుంటుంన్నాయి.
నెల రోజుల క్రితం జిల్లాలోని ఇందారం గ్రామంలో తమ కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఉదయం 10 గంటలకు జనం చూస్తుండగానే బండ తో మోది హత్య చేశారు .
అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని గద్దెరాగడి లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆయన వెంచర్ లొనే పట్టపగలే గొడ్డలితో నరికి చంపిన ఘటన మరువక ముందే ఇప్పుడు ఏకంగా మంచిర్యాల జిల్లా నడిబొడ్డున పట్టపగలు మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డుపై జనం చూస్తుండగా హత్య చేసి పారిపోయారు. ఇలాంటి ఘటనల మూలంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.