Manipur | గుజరాత్ ఘర్షణల్లా మారొచ్చు.. వాటికంటే తీవ్ర స్థాయికి పోవచ్చు..
Manipur కేరళ ఆర్క్ బిషప్ పాంప్లానీ హెచ్చరిక కేంద్ర ప్రభుత్వ మౌనంపై ఆగ్రహం కన్నూర్: మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై కేరళలోని సైరో-మలబార్ క్యాథలిక్ చర్చ్ ఆర్క్బిషప్ జోసెఫ్ పాంప్లానీ ఆందోళన వ్యక్తం చేశారు. ఘర్షణలను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. భారతదేశంలో ఎలాంటి వివక్ష లేదని అమెరికా మీడియాకు ఆయన చెప్పడాన్ని బిషప్ తప్పుపట్టారు. మణిపూర్లో జరుగుతున్న తెగల పోరును 2002 గుజరాత్ మత ఘర్షణలతో పోల్చిన బిషప్.. మణిపూర్ హింసను మారణకాండ దిశగా తీసుకుపోతున్నారని […]

Manipur
- కేరళ ఆర్క్ బిషప్ పాంప్లానీ హెచ్చరిక
- కేంద్ర ప్రభుత్వ మౌనంపై ఆగ్రహం
కన్నూర్: మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై కేరళలోని సైరో-మలబార్ క్యాథలిక్ చర్చ్ ఆర్క్బిషప్ జోసెఫ్ పాంప్లానీ ఆందోళన వ్యక్తం చేశారు. ఘర్షణలను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. భారతదేశంలో ఎలాంటి వివక్ష లేదని అమెరికా మీడియాకు ఆయన చెప్పడాన్ని బిషప్ తప్పుపట్టారు.
మణిపూర్లో జరుగుతున్న తెగల పోరును 2002 గుజరాత్ మత ఘర్షణలతో పోల్చిన బిషప్.. మణిపూర్ హింసను మారణకాండ దిశగా తీసుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నూర్లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘అమెరికాలో మీడియా ప్రశ్నలకు జవాబిచ్చిన ప్రధాని.. భారతదేశంలో వివక్ష లేదని చెప్పారు. అది నిజం కావాలని మేం అంతా కోరుకుంటున్నాం.
మోదీ తన వ్యాఖ్యలపై చిత్తశుద్ధితో ఉంటే.. మణిపూర్ క్రైస్తవులు అది నిజమేనని విశ్వసించేలా చూడాలి’ అన్నారు. లేని పక్షంలో మణిపూర్లో జరుగుతున్న హింసకు, హత్యలకు ప్రభుత్వ అనుమతి ఉందని తామంతా భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
చరిత్రలో కనీవినీ ఎరుగని మారణహోమం దిశగా మణిపూర్ మళ్లుతున్నదని ఆయన హెచ్చరించారు. అది 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లకు మించి ఉండబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్లో దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకూ వందమందికిపైగా చనిపోయారు