" /> " /> " /> " />
Minister Jagadish Reddy |
విధాత: కేసీఆర్ పై అవాకులు, చవాకులు పేలుతున్న రేవంత్రెడ్డి నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి హెచ్చరించారు. బీఆర్ ఎస్ లెజిస్లేజర్ పార్టీకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోనివారే చెబుతున్నట్లు పైసలిచ్చి టిపిసిసి పదవి కొన్న రేవంత్… సోయి లేకుండా మాట్లాడటం మానుకోవాలన్నారు.
“ఏం సాధించినాడని, ఏం త్యాగం చేసినవ్, ఏం నీ చరిత్ర, 50 లక్షలతో దొరికిపోయి చంద్రబాబును తెలంగాణలో ఖతం చేసినవ్, కరెంటు గురించి మాట్లాడి కాంగ్రెస్ను ఖతం చేసినవ్.. ఆశ్రయమిచ్చిన పాపానికి టిడిపికి, చేర్చుకున్న పాపానికి కాంగ్రెస్కు పిండం పెట్టినవ్, తెలంగాణను వ్యతిరేకించే ఒకటిరెండు మీడియా సంస్థల అండతో ఏం మాట్లాడిన రాస్తున్నారని పేలుతున్నవ్, జాగ్రత్త” అని జగదీశ్రెడ్డి ఘాటుగా విమర్శించారు.
నోటికొచ్చినట్లు మాట్లాడటం తెలివితక్కువతనం తప్ప… నాయకత్వ లక్షణం కాదన్నారు. ఇప్పటికైనా రేవంత్ భాష మానుకుంటే మంచిదన్నారు. ఈ రెండుమూడేళ్లలో కేసీఆర్ మీద ఒక్క నిర్మాణాత్మకమైన విమర్శకానీ, సలహా కాని రేవంత్నుంచి లేదన్నారు. రేవంత్ అహంకారంతో, అక్రోశంతో చేస్తున్న విమర్శలు అసహ్యకరమైన భాషలో ఉంటున్నాయన్నారు. మేం కూడా అలా మాట్లాడటం చేతకాకకాదని, కేసీఆర్ మాకు ఆ సంస్కారం నేర్పారని జగదీశ్రెడ్డి అన్నారు.
తెలంగాణలో ఏ బీఆర్ ఎస్ కార్యకర్త నోటినుంచైనా సంక్షేమ పథకాల భాష తప్ప, రేవంత్ మార్క్ పిండాల భాష రాదన్నారు. ప్రజలను చంపడం- సంపాదించుకోవడమే రేవంత్ పార్టీ భాష కాబట్టే, నోటి నుంచి ఆ పదాలే వస్తాయన్నారు. ఒకసారి మాట్లాడితే పొరపాటు అనుకోవచ్చు అని, పదే పదే వస్తోందంటే రేవంత్ పనులే అవి అనుకోవాల్సి వస్తుందన్నారు. రేవంత్రెడ్డి, నోరు అదుపులో పెట్టుకో, పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో, ఒక చరిత్ర నిర్మించిన కేసీఆర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.
రేవంత్ క్షుద్ర రాజకీయాలు మానుకోవాలన్నారు. కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాల గురించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనే తెలంగాణ బిల్లు సమయంలో కేసీఆర్తో స్వయంగా చెప్పారన్నారు. కేసీఆర్ అరుదైన నాయకుడని కూడా ఆయనే కొనియాడినారన్నారు. రేవంత్ చంద్రబాబు శిష్యుడా, అనుచరుడా అనేది మాకు అనవసరమని, దిక్కులేక కాంగ్రెస్ పార్టీ ఆయన్ను అధ్యక్షుడిగా చేర్చుకున్నారన్నారు. దిక్కులేని పార్టీలకు తెలంగాణలో చాలామంది అధ్యక్షులు ఉన్నారని, వారిలో రేవంత్ ఒకడని జగదీశ్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ ఏర్పడ్డాక సమైక్యవాదులందరితో కేసీఆర్ కలిశారని, ఒక్క జగన్నేకాదు, చంద్రబాబును కూడా కేసీఆర్ కలిశారన్నారు. జగన్కు భోజనం పెట్టడం గురించి రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మొదటి క్యాబినేట్ మీటింగ్లోనే కేసీఆర్ మాతో మన లక్ష్యం సాధించుకున్నాం కాబట్టి, మనకు ఎవరూ శత్రువులు లేరన్న విషయాన్ని స్పష్టం చేశారన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు ఎలా అతిధులో, ఏపీ వాళ్లు కూడా అతిధులే అవుతారన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల మీదికి రేవంత్లాగా తుపాకి పట్టుకుని పోలేదన్నారు. చంద్రబాబు దగ్గర పనిచేశానని కూడా చెప్పుకోలేనంత అహంకారంతో రేవంత్ ప్రవర్తిస్తున్నారన్నారు. చావు అంచుల దాకా వెళ్లి, తెలంగాణను సాధించిన కేసీఆర్ చరిత్ర ఎక్కడ? దందాలు-చందాల సిద్ధాంతం పాటించే రేవంత్ ఎక్కడ? అని జగదీశ్రెడ్డి విమర్శించారు.
ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు చేయని అద్భుతమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. అలాంటి నేతకు తద్దినం, పిండం పెడతాననడం, ఒక జాతీయ పార్టీ నాయకుడి లక్షణమా? రాహుల్గాంధీపై అక్రమ కేసులు పెడితే మొట్టమొదట ఖండించింది కేసీఆర్ అనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. పీవీ నరసింహారావుకు సరైన రీతిలో దహన సంస్కారాలు చేసుకోలేని పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్, చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరుకున్నట్లు చేరారన్నారు.
గద్దర్ గురించి మాట్లాడే అర్హత మాకే ఉంది
గద్దర్ బతికినంత కాలం ఏ పార్టీల మీద పోరాటం చేశారో, గద్దర్ శరీరంలోని బుల్లెట్లు ఏ ప్రభుత్వాలు దింపాయో ఒకసారి రేవంత్ చరిత్ర తెలుసుకోవాలన్నారు. గద్దర్ జీవితం ఎవరి దుర్మార్గాలకు వ్యతిరేకంగా మొదలైందో చూడాలన్నారు. గద్దర్ గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం అంటే చంపినోడే, దహన సంస్కారాలు చేస్తున్నట్లు ఉంటుందన్నారు. రేవంత్ మాటలు వింటే గద్దర్ ఆత్మ క్షోభిస్తాదని జగదీశ్రెడ్డి అన్నారు.
గద్దర్కు నివాళులు అర్పించడం కూడా తప్పా? అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం నేరమా? గద్దర్ కలిసి పనిచేసింది మాతోనే అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. కేసీఆర్తో కలిసి గద్దర్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారన్నారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన, గద్దర్ శరీరంలో బుల్లెట్లకు కారణమైన చంద్రబాబును కలిశారు, బతుకంతా పోరాడిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కూడా గద్దర్ కలిశారన్నారు.
గద్దర్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ మనిషా, ఎంపీనా, ఎమ్మెల్యేనా? ఆయనకు గౌరవించే పార్టీ మాది. గద్దర్ ఏ కూడు, గుడ్డ కోసం కొట్లాడిండో, ఆ ఆశయాలను నెరవేరుస్తున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. అందుకే ఈ పదేళ్లలో గద్దర్ పోరాటాలు చేయడం లేదన్నారు. గద్దర్ గురించి మాట్లాడే అర్హత మా పార్టీకే ఉందన్నారు.
ఎన్ని వేలమందిని టిడిపి, కాంగ్రెస్ పార్టీలు కాల్చి చంపాయో ఆ పార్టీల నుంచి వచ్చిన గురువింద రేవంత్ గుర్తు చేసుకోవాలన్నారు. గద్దర్ ఆశయాలనేకాదు, కలలను కూడా నెరవేర్చినవాళ్లం మేమే అని జగదీశ్రెడ్డి అన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు, రేవంత్ చిల్లరమాటలు ప్రజలు పట్టించుకోవడం లేదు అన్నారు.