సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏడాది ఉంటే మహా ఎక్కువ అంటూ బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా కౌంటర్ వేశారు
మేం గేట్లు తెరిస్తే మీకు ఒక్క ఎమ్మెల్యే మిగలరు
రేవంత్రెడ్డి ముఖం చూడలేకనే అసెంబ్లీకి ముఖం చాటేశావు
మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్
కోడ్ ముగిసిపోగానే హామీల అమలు
విధాత: సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏడాది ఉంటే మహా ఎక్కువ అంటూ బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా కౌంటర్ వేశారు. నల్లగొండ రామాలయం శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ టచ్ చేస్తే బీఆరెస్ను పునాదులతో సహా కూల్చేస్తామని హెచ్చరించారు.
దేశంలోనే దరిద్రమైన పాలన అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి సీఎం అయ్యారని, రేవంత్ రెడ్డి ముఖం చూడలేక కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదంటూ మండిపడ్డారు. మేము గేట్లు తెరిస్తే.. ఎమ్మెల్యేలుగా ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప బీఆరెస్లో ఒక్క ఎమ్మెల్యే మిగలరని స్పష్టం చేశారు. మరో 3 నెలల్లో బీఆరెస్ పార్టీ కనుమరుగవుతుందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 12-13స్థానాల్లో విజయం సాధించబోతుందని జోస్యం చెప్పారు.
మెదక్లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా కూడా బీఆరెస్ గెలవదన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని చూస్తుంటే జాలీ వేస్తుందన్నారు. సొంత బిడ్డ కవిత జైలుకు వెళ్లిందని, కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు సహా కుటుంబ సభ్యులంతా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల కేసుల్లో ప్రమేయం ఉందని ఆరోపించారు. కేసీఆర్ తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వెంకట్ రెడ్డి తెలిపారు. రావులు అందరూ జైలుకు వెళ్తే చర్లపల్లి జైలు సరిపోదన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వ్యవహారంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్ను పోటు పొడిచిన వ్యవహారంలో కేసీఆర్ కూడా ఉన్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆరెస్కు ఒక్క సీటు కూడా రాదని, వస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వారా కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని, వాళ్లిద్దరూ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని, చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టించి స్వాగతం పలుకుతామని వెంకట్రెడ్డి వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఎన్నికల కోడ్ కారణంగా తామిచ్చిన ఎన్నికల హామీల అమలుకు బ్రేక్ పడిందని, కోడ్ ముగిసిపోగానే హామీలన్ని అమలు చేస్తామన్నారు. రైతులకు 2లక్షల రుణమాఫీ దశల వారిగా అందరికి అమలు చేస్తామన్నారు.
మాతాశిశు భవనం సత్వర పూర్తికి ఆదేశాలు
నల్గొగొండ పర్యటనలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సమస్యలపై సిబ్బందితో మాట్లాడి, పేషెంట్లు, అటెండెంట్ల కోసం సకల సౌకర్యాలతో అనువుగా ఉండేలా భవన నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ, ఆర్అండ్ బీ అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు.