గజమాలతో సన్మానం చేసి.. స్వాగతం పలికిన గ్రామ ప్రజలు విధాత: అధికారం కోసం కులాలు, మతాల పేరిట దేశప్రజలను చీల్చాలని బిజెపి పార్టీ ప్రయత్నిస్తుంటే రాహుల్ గాంధీ భారత జాతిని ఏకం చేసేందుకు భారత జోడో యాత్ర చేపట్టారని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధి వేములపల్లి మండలం అమనగల్లు గ్రామంలోని కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి […]
విధాత: అధికారం కోసం కులాలు, మతాల పేరిట దేశప్రజలను చీల్చాలని బిజెపి పార్టీ ప్రయత్నిస్తుంటే రాహుల్ గాంధీ భారత జాతిని ఏకం చేసేందుకు భారత జోడో యాత్ర చేపట్టారని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
మిర్యాలగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధి వేములపల్లి మండలం అమనగల్లు గ్రామంలోని కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ పార్వతి రామలింగేశ్వరస్వామి సన్నిధి నుంచి నిర్వహించనున్న హాత్ సే హాత్ జోడో యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, బిఎల్ఆర్ కు అమనగల్లు గ్రామ ప్రజలు భారీఎత్తున స్వాగతం పలికి భారీ గజమాలతో సన్మానించారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టిన నీరవ్ మోడీ, లలిత్ మోడీని విదేశాల నుంచి వెనక్కి రప్పించడంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆదాని అక్రమాలను పార్లమెంట్లో ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరినైనా వ్యక్తిగత కక్షలతో ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తారో చెప్పడానికి రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుచేయడమే నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీ కి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని ఆయన అభివర్ణించారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థని రద్దు చేయడమని విమర్శించారు.
భారతదేశంలో కేరళలోని వాయినాడు నియోజకవర్గం నుండి రాహుల్ గాంధీ 12 లక్షల 76,945 అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలుపొందారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి యావత్ భారతదేశం అండగా నిలుస్తుందని, యూపీఏ పాలనలో నిరుపేదలకు పట్టెడన్నం పెట్టి కడుపు నింపేందుకు ఎన్ఆర్ఈజీఎస్ పథకం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.
పాలనలో పారదర్శకత కోసం సమాచార హక్కుచట్టాన్ని రూపొందించిందన్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించడంతో పాటు అమలు చేసేందుకు ఎఫ్సిఐకి అండగా నిలిచి బలోపేతం చేసిందన్నారు. యూపీఏ పాలనలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 105 కు పెరిగినప్పటికి ధరల పెంపు భారం సామాన్య ప్రజలపై పడనీయకుండ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భరించిందన్న విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
దేశంలోని రోడ్లు విమానాశ్రయాలు, ఓడరేవులు, బొగ్గు గనులు. ఒక వ్యక్తి చేతిలో ఒకే వ్యక్తి వ్యాపారం కిందికి మార్పిడి చేస్తూ దేశ సంపద కొల్లగొడుతుండడాన్ని ప్రశ్నించడం నేరమా అని నిలదీశారు. దేశ సంపదను అదానీ కొల్లగొడుతుంటే వాస్తవాలు వెలికి తీసేందుకు జేపీసీ నియామకం చేపట్టాలని ప్రతిపక్షాలు అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చినా స్పందన కరువైందన్నారు.
నీతి, నిజాయితీకి నిరాడంబరతకు నిదర్శనం రాహుల్ గాంధీ ఆయన వెంట దేశ ప్రజలు ఉన్నారన్న విషయాన్ని మరచిపోయి బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడవద్దని రానున్నది ఇందిరమ్మ కాంగ్రెస్ రాజ్యమేనన్నారు.
మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బిఎల్ ఆర్ మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే నూతన ఉత్సాహం కార్యకర్తల్లో కనిపిస్తుందన్నారు. జోడో యాత్రలో తనతో పాటు కదం తొక్కిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు చిరుమర్రి కృష్ణయ్య, వేములపల్లి ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య, స్థానిక సర్పంచ్ వలంపట్ల ఝాన్సీ ప్రవీణ్, మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్, పొదిళ్ల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు మాలి కాంతారెడ్డి, నియోజకవర్గ పరిధిలోని పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.