Miryalaguda
విధాత: ప్రధాన మంత్రి మోదీ హన్మకొండ సభలో పచ్చి అబద్ధాలను మాట్లాడారని, ప్రధానమంత్రి హోదాలో ఉండి అసత్యాలు ప్రచారం చేయడం సబబు కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే ఎన్.భాస్కర్రావుతో కలిసి గుత్తా మీడియాతో మాట్లాడుతు అసత్యాలు మాట్లాడి ప్రధానమంత్రి హోదాను దిగజార్చారన్నారు.
కేవలం కేసీఆర్ పైన, ఆయన కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేసి బురద చల్లడానికే మోదీ ఢిల్లీ నుండి వచ్చారన్నారు. ప్రధానమంత్రి హోదాలో రాష్టానికి వచ్చిన మోదీ అసలు ఈ రాష్టానికి ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అని చెప్పలేక కేసీఆర్ ప్రభుత్వంపైన అవినీతి ఆరోపణలు చేశారన్నారు.
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలో పురోగమిస్తుంటే.. మోడీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తోందన్నారు. దేశ జిడిపి రేట్ గణనీయంగా తగ్గిందని, రూపాయి విలువ తగ్గిందన్నారు.
కేసీఆర్ పైన ఆరోపణలు చేసిన మోదీనే పెద్ద అవినీతికి ఆద్యుడన్నారు.
దేశంలో అధాని చేస్తున్న అవినీతిలో ప్రధానమంత్రి మోదీ హస్తం ఉందన్నారు. ఆయన సన్నిహితులు కాబట్టే మోసకారులకు 12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయించారన్నారు. కేసీఆర్ పైన, ఆయన కుటుంబ సభ్యులపైన అవినీతి ఆరోపణలు చేయడం సూర్యునిపై ఉమ్మడం లాంటిదేనన్నారు.
బిజిపి ప్రభుత్వంలో దేశంలో ప్రజాస్వామ్యము కూని అవుతోందన్నారు. సామాన్యులు జీవించలేని విధంగా నిత్యవసర ధరలు పెరిగాయన్నారు. ప్రధాని వెంట సీబీఐ, ఈడీలు ఉంటే కేసీఆర్ వెంట ప్రజలు ఉన్నారన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన బిజెపి పార్టీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మరన్నారు.
నూటికి నూరు శాతం రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడుతారన్నారు. ప్రధానమంత్రి మోడీ విభజన హామీలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీని తుంగలో తొక్కి, రైల్వే రిపేర్ షెడ్ ని ప్రారంభోత్సవం చేశారన్నారు.