విధాత బ్యూరో,కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫోన్ పై రాద్ధాంతం కొనసాగుతూనే ఉంది. ఆయన తన ఫోన్ స్వాధీనం చేస్తే తమకు మరిన్ని ఆధారాలు లభిస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ అంటుండగా, తన ఫోన్ పోలీసులే లాక్కున్నారని బండి సంజయ్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆదివారం తన ఫోన్ వెతికి పెట్టాలని కోరుతూ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రత కారణాల రీత్యా తాను తన చెల్లెలి ఫోన్ ఉపయోగిస్తున్నానని,
అందులో విలువైన కాంటాక్ట్ నెంబర్లు ఉన్న దృష్ట్యా దాన్ని వెతికి పెట్టాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఫోనే కీలకమని పోలీసులు చెప్తున్నారు. అర్ధరాత్రి వేళ పోలీసులు తనను అరెస్టు చేసిన సమయంలో ఫోన్ మిస్ అయ్యింది అంటున్న సంజయ్.. అదే విషయాన్ని వారికి తెలియజేశానని చెప్తున్నారు.
అయితే తాము కోరినప్పటికీ సంజయ్ ఫోను స్వాధీన పరచడం లేదని వరంగల్ cp అంటున్నారు.
ఫోన్ విషయంలో అటు పోలీసులు, ఇటు సంజయ్ వాదనలు ఈ విధంగా ఉండగా ఇంతకీ ఆ ఫోన్ ఎటు పోయింది అన్న చర్చ సర్వత్రా సాగుతోంది.