Etela Rajender | మాదిగలకు తీవ్ర అన్యాయం కేసీఆర్ మాటలకు, చేతలకూ పొంతనలేదు ఈసారి సర్కారుకు రాంరాం బీజేపీ నేత ఈటల రాజేందర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అక్రమార్కులకే బీఆర్ఎస్ మళ్లీ పోటీ చేసేందుకు సీట్లు కేటాయించిందని బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో 35 సీట్లు మారుస్తాం.. ఎమ్మెల్యేల భూ ఆక్రమణలు, దందాలు పెరిగాయని సీఎం కేసీఆర్ స్వయంగా వీళ్లకు ఓట్లు పడవు.. […]
Etela Rajender |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అక్రమార్కులకే బీఆర్ఎస్ మళ్లీ పోటీ చేసేందుకు సీట్లు కేటాయించిందని బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో 35 సీట్లు మారుస్తాం.. ఎమ్మెల్యేల భూ ఆక్రమణలు, దందాలు పెరిగాయని సీఎం కేసీఆర్ స్వయంగా వీళ్లకు ఓట్లు పడవు.. పద్ధతి మార్చుకోండని చెప్పారు. కానీ ఎందుకు అందరికీ ఇచ్చారు అంటే.. వేరే పార్టీ లోకి పోతారు అని భయపడి వాళ్ళను కంట్రోల్ లో పెట్టుకోడానికి ఇచ్చారని విమర్శించారు.
మహబూబాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. తెలంగాణలో 11 శాతం ఉన్న మాదిగలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా జాతిని అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రిజర్వేషన్లు లేకుంటే ఎస్ సీ, ఎస్టీ సీట్లు కూడా వారే తీసుకొనే వారు. బీసీలు 52 శాతం ఉంటే 23 సీట్లు ఇచ్చారు. ముదిరాజ్, కురుమ, నాయీబ్రహ్మణ, రజక, కుమ్మర, ఎంబీసీలకు ఒక్క సీటు లేదు.
బీఆర్ఎస్ బీసీలకు, ఓబీసీలకు వ్యతిరేకమైన పార్టీ’ అంటూ మండిపడ్డారు. బీజేపీ సామాజిక నేపథ్యంతో ముందుకు పోతుందన్నారు. ఆదివారం అమిత్ షా మీటింగ్ ఖమ్మం డిగ్రీ కాలేజీలో జరగబోతుందన్నారు. మహబూబ్ బాద్ లో కనీవినీ ఎరుగని రీతిలో స్పందన ఉందన్నారు. ‘కేసీఆర్ చెప్తున్న మాటలకు, చేసే పనులకు పొంతన లేకుండా పోయింది. డబ్బు బలంతో మీడియా మేనేజ్ మెంట్ తో అదరగొట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వారికి ఈసారి ఓటు వేసే అవకాశం లేదు కాబట్టి ప్రజలకు నాయకత్వం వహించడానికి బీజేపీ ముందుకు వచ్చింది’ అని అన్నారు.
అందులో భాగమే అమిత షా మీటింగ్. త్వరలో నడ్డా, మోదీ మీటింగ్లు ఉంటాయన్నారు. సెకండ్ ఏఎన్ఎంలు సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాదు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, 57 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇచ్చిన రుణమాఫీ డబ్బులు వడ్డీకి సరిపోవడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ది చెప్పే పార్టీ బీజేపీ. ఆ సత్తా ఉన్న పార్టీ ఇదొక్కటేనని ఈటల చెప్పారు. సమావేశంలో బీజేపీ నాయకులు హుస్సేన్ నాయక్, సురేష్ రెడ్డి రాజ వర్ధన్ రెడ్డి, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.