బోనస్ అడిగితే డ్రాయర్ ఊడగొడుతానంటావా
సీఎం రేవంత్రెడ్డి విమర్శలపై హరీశ్రావు ఫైర్
విధాత : సీఎం రేవంత్రెడ్డిని వడ్లకు 500బోనస్ ఇవ్వమంటే నీ డ్రాయర్ ఊడగొడుతా కేసీఆర్ అని అంటున్నాడని, తెలంగాణ తెచ్చిన..పదేళ్లు సీఎంగా చేసిన నాయకుడిని పట్టుకుని మాట్లాడే భాషా ఇదేనా అని…నీవు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేక చడ్డీ గ్యాంగ్ సభ్యుడివా అంటు ఎమ్మెల్యే హరీశ్రావు ( MLA Harish Rao) మండిపడ్డారు. బుధవారం పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని శ్రీ సిద్ది గణపతి దేవాలయం (గణేష్ గడ్డ) ఆవరణలో బీఆరెస్ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచార రథాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మెదక్ పార్లమెంట్ స్థానం బీఆరెస్ పార్టీ అడ్డా అని 2004నుంచి వరుసగా గులాబీ జెండాదే గెలుపని, మెదక్లో వెంకట్రామి రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయమని బీఆరెస్ అగిడితే సీఎం రేవంత్రెడ్డి ఇష్టారాజ్యంగా తిట్ల పురాణం వినిపిస్తున్నాడని విమర్శించారు. ఓట్ల కోసం ప్రజలను కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ వార్తలు, లీకులతో బీఆరెస్ పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి పక్కా లోకల్.. తెల్లాపూర్లోనే నివాసం ఉంటారని పేర్కొన్నారు. దుబ్బాక ప్రజలు బీజేపీ అభ్యర్ధి రఘునందన్రావును చిత్తు చిత్తుగా ఓడించారని, పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆరెస్ పార్టీయేనని, మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసే వెంకట్రామి రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ లోక్ సభ బీఆరెస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.