ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలిగా చేర్చుతు సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కవితను ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీస్లు జారీ చేసింది
విధాత: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలిగా చేర్చుతు సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కవితను ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీస్లు జారీ చేసింది. ఇప్పటికే ఈడీ విచారణలో సెల్ఫోన్లు అప్పగించిన కవిత, తదుపరి విచారణకు హాజరుకావాలన్న ఈడీ నోటీస్లను పట్టించుకోలేదు. లిక్కర్ కేసులో తనకు ప్రమేయం లేదని, మహిళగా తనను ఇంటి వద్దనే విచారించాలని కోరుతూ తను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణ తేలాకే తాను స్పందిస్తానని పేర్కోన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అభిషేక్ జైన్, శరత్ చంద్రారెడ్డి, మాగుంటలను విచారించిన ఈడీ, సీబీఐలు కేసులో సౌత్ గ్రూప్ లావాదేవిల్లో కవిత ప్రమేయం ఉందని ఆరోపించాయి.
గతంలో 161కింద నోటీస్లు ఇచ్చిన సీబీఐ ఈ దఫా 41కింద నోటీస్లు జారీ చేసినందునా కవిత నేరుగా విచారణకు హాజరుకావాల్సివుంది. అటు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ సైతం ఈనెల 27న విచారణకు రానుంది. అంతకుముందు ఈడీ కూడా లిక్కర్ కేసులో తాము కవితను సాక్షిగా కాకుండా నిందితురాలిగానే విచారించామని కోర్టుకు తెలిపింది. ఈ నేపధ్యంలో సీబీఐ కూడా కవితను కేసులో నిందితురాలిగా చేర్చడం, నోటీస్లు జారీ చేయడంతో మునుముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు జరిగితే, ఆ వెంటనే కవిత అరెస్టు కూడా జరగవచ్చని భావిస్తున్నారు.