Nalgonda
విధాత: బీఆర్ఎస్ మాజీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో నల్గొండ జిల్లా బిఆర్ఎస్ మాజీ నేత చకిలం అనిల్ కుమార్ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. శనివారం చకిలం ఖమ్మంలో పొంగులేటిని కలిసి భవిష్యత్తు రాజకీయ కార్యక్రమాలపై చర్చించారు.
చకిలం కొంతకాలంగా పొంగులేటితో టచ్ లో ఉన్నారు. పొంగులేటితో చకిలం భేటీలో కొత్త పార్టీ పెట్టడమా.. లేక కాంగ్రెస్, బిజెపిలలో ఏదో ఒక పార్టీలో చేరడమా అన్న విషయమై వారు మంతనాలు సాగించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి చకిలంతో పాటు ఇంకెవరైనా బిఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీ ముఖ్యులు పొంగులేటితో జత కడతారా అన్న విషయంపై కూడా వారి భేటీలో ప్రస్తావనకు వచ్చింది.
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ టికెట్లు ఆశిస్తున్న వారిలో మెజారిటీ నేతలు పొంగులేటి పార్టీ పెడితే ఆ పార్టీలో చేరే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. అదే జరిగితే పొంగులేటికి చెందిన ఖమ్మం జిల్లాలో, జూపల్లికి చెందిన మహబూబ్ నగర్ జిల్లాలో, చకిలం వంటి బిఆర్ఎస్ అసంతృప్త నేతలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తమ వర్గం బలోపేతం అవుతుందని వారు భావిస్తున్నారు.
కొత్త పార్టీ పెడితే ఈ మూడు జిల్లాల్లో బలమైన నాయకులు తమ వెంట వస్తారని పొంగులేటి, జూపల్లిలు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బిఆర్ఎస్ను ఓడించడం, సీఎం కేసీఆర్ను గద్దె దించడం దిశగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బిఆర్ఎస్ అసంతృప్త నాయకులను సమీకరించి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకే ఎక్కువగా పొంగులేటి, జూపల్లి మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. ఈ నెలాఖరులోగా పొంగులేటి, జూపల్లిల భవిష్యత్ రాజకీయ కార్యచరణ తేటతెల్లమవుతుందని వారి అనుచరులు స్పష్టం చేస్తున్నారు.