Nalgonda విధాత: రంజాన్ ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలిపేందుకు అధికార, విపక్ష నాయకులు పోటీపడ్డారు. ఎన్నికల ఏడాది కావడంతో గతంలో కంటే ఎక్కువగా ఇఫ్తార్ విందులు, తోఫాలు ఇవ్వడంలో పోటీపడిన నాయకులు రంజాన్ రోజున ఈద్గాలు, మసీదుల వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పడంలో కూడా హడావుడి చేశారు. సూర్యాపేటలో మంత్రి జి. జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. […]
Nalgonda
విధాత: రంజాన్ ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలిపేందుకు అధికార, విపక్ష నాయకులు పోటీపడ్డారు. ఎన్నికల ఏడాది కావడంతో గతంలో కంటే ఎక్కువగా ఇఫ్తార్ విందులు, తోఫాలు ఇవ్వడంలో పోటీపడిన నాయకులు రంజాన్ రోజున ఈద్గాలు, మసీదుల వద్ద ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పడంలో కూడా హడావుడి చేశారు.
సూర్యాపేటలో మంత్రి జి. జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఇక నల్గొండ(Nalgonda) ఈద్గా వద్దా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో పరస్పర ఎదురుపడిన వైరి పార్టీల నాయకులు పక్కకు తప్పుకునే అవకాశాలు లేక ముఖాల మీద చిరునవ్వులు పులుముకొని, మాట మాట కలుపుకొని ఆలింగనాలతో అందరినీ విస్మయపరిచారు.
స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావులు నల్గొండ ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు.
తదుపరి ఒక్కొక్కరుగా అన్ని పార్టీల నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ విరోధులైన కంచర్ల, ఒకనాటి బిఆర్ఎస్ మిత్రుడైన దుబ్బాక నరసింహరెడ్డిలు పరస్పరం ఎదురుపడగా చిరునవ్వులతో పలకరించుకొని, ఆలింగనం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.
ఇదే రీతిలో కంచర్లకు పోటీగా టికెట్ రేసులో ఉన్న గుత్తా అమిత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకోగా పరస్పరం పలకరించుకున్నారు. మరో బిఆర్ఎస్ ఆశావాహ నేత పిల్లి రామరాజు మాత్రం కంచర్ల వద్దకు వెళ్లకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పరస్పర పలకరింపులు, ఆలింగనాలు చేసుకోవడం ఆసక్తి రేపింది. అలాగే అమిత్ రెడ్డిని కూడా రామరాజు మర్యాదపూర్వకంగా పలకరించారు.
ఇక కాంగ్రెస్ నేత దుబ్బాక నరసింహ రెడ్డి తన సొంత పార్టీ ఎంపీ, స్థానిక నేత, మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదురుపడగానే మర్యాదపూర్వకంగా పలకరించుకొని చిరునవ్వులతో అలింగనం చేసుకున్నారు.
ఒకే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కోమటిరెడ్డి, దుబ్బాకలు సుదీర్ఘకాలంగా కలుసుకోలేక పోవడం… ఈద్గా వద్ద వారు పరస్పరం కలవడంతో ఇరువర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తిగా చూశారు. దుబ్బాక తదుపరి బిఆర్ఎస్ నేత అమిత్ రెడ్డిని కూడా పలకరించారు.
మరోవైపు దేవరకొండ ఈద్గా వద్ద స్థానిక ఎమ్మెల్యే ఆర్. రవీంద్ర కుమార్ కు కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థియైన మాజీ ఎమ్మెల్యే ఎన్. బాలునాయక్, బిఆర్ఎస్ అసమ్మతినేత మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహలు ఎదురుపడగా, వారంతా పరస్పరం పలకరింపులు, అలింగనాలు చేసుకున్నారు. ఈ పరిణామాలను ఆ రెండు పార్టీల కార్యకర్తలు ఆసక్తిగా గమనించారు.