Karnataka | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం కొలువుదీరనుంది. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందింది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మాత్రం ఆహ్వానం అందలేదు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆహ్వానం అందినప్పటికీ, ఇతరత్రా పనుల వల్ల ఆమె హాజరు కాలేకపోతున్నారు. ఇక కేరళ సీఎం పినరయి విజయన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ […]
Karnataka | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం కొలువుదీరనుంది. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందింది.
అయితే తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మాత్రం ఆహ్వానం అందలేదు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆహ్వానం అందినప్పటికీ, ఇతరత్రా పనుల వల్ల ఆమె హాజరు కాలేకపోతున్నారు. ఇక కేరళ సీఎం పినరయి విజయన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీఎస్సీ అధినేత్రి మాయావతికి కూడా ఆహ్వానం అందలేదని సమాచారం.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బీహార్ సీఎం నితీశ్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబుబా ముఫ్తీతో పాటు డీ రాజా, సీతారాం ఏచూరి, కమల్ హాసన్కు ఆహ్వానం అందింది.
కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం బెంగళూరులోని కంఠీరావ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు జరగనుంది. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన విషయం విదితమే.