Pastor Praveen: రోడ్డు ప్రమాదంలోనే పాస్టర్ ప్రవీణ్ మృతి : ఐజీ అశోక్ కుమార్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయాడని పోలీసులు తేల్చారు. రాజమండ్రి ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశంలో పాస్టర్ ప్రవీణ్ కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టామని, వాటన్నింటిలోనూ అతను రోడ్డు ప్రమాదం కారణంగా చనిపోయినట్లు తేలిందన్నారు.

Pastor Praveen: : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయాడని పోలీసులు తేల్చారు. రాజమండ్రి ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశంలో పాస్టర్ ప్రవీణ్ కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టామని, వాటన్నింటిలోనూ అతను రోడ్డు ప్రమాదం కారణంగా చనిపోయినట్లు తేలిందన్నారు. ప్రవీణ్ కు సంబంధించి పలుచోట్ల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామని, దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారని వారిని కూడా విచారించామని తెలిపారు. పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టామని, ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని ప్రవీణ్ కుటుంబసభ్యులు చెప్పారని, సోషల్ మీడియాలో మాట్లాడినవారు ఎలాంటి ఆధారాలూ ఇవ్వలేదని తెలిపారు. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలేనని స్పష్టం చేశారు.
మార్గమధ్యలో మూడుసార్లు ప్రమాదాలు
ప్రవీణ్ దారిలో హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం షాపులకు వెళ్లారని, దారిలో ప్రవీణ్ కు మూడుసార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయని వెల్లడించారు. జగ్గయ్యపేట వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పిందని, కీసర టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పి ప్రవీణ్ కింద పడిపోయారని, కీసర వద్ద ప్రవీణ్ కు సాయం చేసేందుకు అంబులెన్స్, వైద్య సిబ్బంది వెళ్లారని తెలిపారు. గుంటుపల్లి దగ్గర పాస్టర్ ప్రవీణ్ కాసేపు ఆగారని, బంకులోకి వచ్చేటప్పటికే బండిపై నుంచి లగేజ్ పక్కకు ఒరిగిపోయిందని, రామవరప్పాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ కండిషన్ ను ఆటోడ్రైవర్ చూశారని, ట్రాఫిక్ ఎస్ఐ సూచనతో పార్కులో రెండు గంటలు నిద్రపోయారన్నారు. కండిషన్ బాగాలేదు..వెళ్లవద్దని చెప్పినా ప్రవీణ్ ముందుకెళ్లారని, హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్ వేసుకునే ప్రయాణించారని ఐజీ తెలిపారు.
దారిలో మూడుసార్లు మద్యం కొనుగోలు
ఏలూరులో మూడోసారి పాస్టర్ ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారని, మద్యం షాపునకు వచ్చినప్పటికే ప్రవీణ్ కళ్లజోడు పగిలిపోయిందని, కొంతమూరు పైవంతెనపై కూడా పాస్టర్ ప్రవీణ్ వేగంగా వెళ్లారని, ప్రమాదస్థలంలో ప్రవీణ్ బుల్లెట్ రోడ్డు పక్కకు దూసుకుపోయిందని వివరించారు. పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ ను ఏ వాహనం కూడా ఢీకొనలేదని, పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ కు, పక్కన వెళ్తున్న కారుకు గ్యాప్ చాలా ఉందని తేలిందన్నారు. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి.. కంకర రాళ్లు ఉన్నాయని, బుల్లెట్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్ పై పడిందని ఫోరెన్సిక్ నివేదిక చెప్పిందని వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు బండి ఫోర్త్ గేర్ లో ఉందని, ఇతర వాహనాలు ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారని తెలిపారు. ప్రవీణ్ దారిలో ఆరుసార్లు యూపీఐ పేమెంట్లు చేశారని , ప్రవీణ్ శరీరంలో మద్యం ఉందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు.