లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి మళ్లీ కేరళలోని వయనాడ్ నుంచే పోటీ చేస్తున్నారు
వయనాడ్తోపాటు అమేధి నుంచి పోటీకి రెడీ
రాయబరేలి నుంచి పోటీకి ప్రియాంక సై
విధాత ప్రతినిధి: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి మళ్లీ కేరళలోని వయనాడ్ నుంచే పోటీ చేస్తున్నారు. అయితే దీంతో దీర్ఘకాలంగా గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని అమేథి నుంచి రాహుల్ పారిపోయారనే విమర్శల నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ఈసారి పోటీ చేసేందుకు రాహుల్గాంధీ సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో అమేథి నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అదే ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీచేసి గెలుపొందారు.
దీంతో వయనాడ్ తనకు సురక్షితమైన సీటుగా భావించి ఈ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచే పోటీచేస్తున్నారు. మరోవైపు సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్లడంతో.. ఓటమి భయంతోనే రాయబరేలీ నుంచి గాంధీ కుటుంబం తప్పుకుందనే విమర్శలు వచ్చాయి. దీంతో రాహుల్ తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. వయనాడ్తో పాటు అమేథిలో రాహుల్ పోటీ చేయడానికి సిద్ధపడగా, రాయబరేలి నుంచి ప్రియాంక పోటీచేసే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
వయనాడ్లో రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఐదో విడతలో అమేథిలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 26న వయనాడ్లో పోలింగ్ జరగనుండగా..24తో ప్రచారం ముగుస్తుంది. ఆ తర్వాత అమేథిలోనూ రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఓటమి భయంతో పారిపోయారని బీజేపీ విమర్శలు చేస్తుండటంతో కాంగ్రెస్ అగ్రనేత తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
తప్పుడు ప్రచారానికి గట్టి జవాబు కోసమేనా?..
రెండు చోట్ల పోటీ అంశంపై కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను భయపడే వ్యక్తిని కాదని, వ్యక్తిగత కారణాలతోనే అమేథిలో పోటీ చేయడంలేదనే విషయాన్ని స్పష్టం చేశారట. కానీ బీజేపీ భయంతో పారిపోయినట్లు మాట్లాడుతున్నారని, దీంతో ఉత్తర భారతంలో నెగిటివ్ ప్రచారం ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని, సంప్రదాయ సీటు కావడంతో తాను ఈ విషయంలో పునరాలోచిస్తానని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి సరైన సమాధానం ఇస్తానని రాహుల్ చెప్పారట.
మరోవైపు ఉత్తరప్రదేశ్లోని అమేథి నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశం ఉందని యూపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వయనాడ్లో పోలింగ్కు ముందు ఈ విషయాన్ని ప్రకటిస్తే అక్కడ గెలుపుపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతోనే రాహుల్ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయనట్లు తెలుస్తోంది. అమేథి నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తే… వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. స్మృతి ఇరానీ అమేథీలో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు.