విధాత : మంత్రి పదవి ఆశించి భంగపడి అలకబూనిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నాయకత్వం వరుస బుజ్జగింపులతో కాస్తా మెత్తపడ్డారు. తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని.. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం చేకూరాలంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు..ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయని… అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చానని పేర్కొన్నారు. ఈరోజు నేను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటానన్నారు. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదని..కొన్నిసార్లు, పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుందని..అదే మార్గాన్ని నేను ఎంచుకున్నానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.