ICTC | రేషనలైజేషన్ పేరుతో ఐసీటీసీ కేంద్రాల కుదింపు
ICTC వివాదాస్పదమవుతున్న కేంద్రం చర్యలు న్యాకో సర్కులర్ (11025) పట్ల సర్వత్రా నిరసనలు దేశంలో 593, రాష్ట్రంలో 40 ఐసీటీసీ కేంద్రాల ఎత్తివేత ! "ఎయిడ్స్" నియంత్రణ దిశగా ప్రతికూలత విధాత బ్యూరో, కరీంనగర్: హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) పేరుతో ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్ష, కౌన్సిలింగ్ (ఐసీటీసీ) కేంద్రాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (న్యాకో) ఈ […]

ICTC
- వివాదాస్పదమవుతున్న కేంద్రం చర్యలు
- న్యాకో సర్కులర్ (11025) పట్ల సర్వత్రా నిరసనలు
- దేశంలో 593, రాష్ట్రంలో 40 ఐసీటీసీ కేంద్రాల ఎత్తివేత !
- “ఎయిడ్స్” నియంత్రణ దిశగా ప్రతికూలత
విధాత బ్యూరో, కరీంనగర్: హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) పేరుతో ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ పరీక్ష, కౌన్సిలింగ్ (ఐసీటీసీ) కేంద్రాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (న్యాకో) ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. జూలై 5వ తారీఖున న్యాకో జారీ చేసిన సర్కులర్ నంబర్ 11025 పట్ల ఆ సంస్థ సిబ్బంది ఆందోళనలో పడ్డారు.
ఎయిడ్స్ రోగులు సైతం అయోమయానికి గురవుతున్నారు.
ప్రపంచ దేశాలను గడగడలాడించిన మహమ్మారిగా పేరున్న హెచ్ఐవి(ఎయిడ్స్) వ్యాధిగ్రస్తులలో ఉన్న వివక్షతలను పారద్రోలి, రోగులలో మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చేందుకు ఇప్పటివరకు సుశిక్షితులు, నిష్ణాతులైన కౌన్సిలర్స్ సేవలు అందిస్తు వసున్నారు. రేషనలైజేషన్ కారణంగా సదరు కేంద్రాల సంఖ్య కుదించుకపోతుండటంతో ఆ మేరకు వారి సేవలు నామమాత్రం కానున్నాయి. ఎయిడ్స్ పరీక్షలు చేయించుకోవడానికి అందుబాటులో ఐసీటీసీ కేంద్రాలు లేకపోవడం వల్ల, సదరు హెచ్ఐవీ, అనుమానిత, హై రిస్క్ గ్రూప్, సంక్రమిత వ్యక్తుల ద్వారా చాప కింద నీరు లాగా సమాజంలో మరింతగా ఎయిడ్స్ వ్యాధి ప్రబలే ప్రమాదం ఉందన్న ఆందోళన వినిపిస్తుంది.
రేషనలైజేషన్ తో తగ్గనున్న కేంద్రాలు
దేశం మొత్తంమీద వివిధ రాష్ట్రాలలో 593 ఐసీటీసీ కేంద్రాలు ఎత్తివేయడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో 40 సమీకృత సలహా, పరీక్ష కేంద్రాలు (ఐసీటీసీలు) మూతపడనున్నాయి.
రేషనలైజేషన్ పేరిట ఐసీటీసీ కేంద్రాలను ఎత్తివేసి అందులో ఉన్న కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్ సిబ్బందిని ఇతర ప్రాంతాల్లోని ఐసీటీసీ కేంద్రాలలో సర్దుబాటు చేయనున్నారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పరిపాలన, ప్రజా సంక్షేమ పథకాలు ఉండాలని పదేపదే వల్లే వేసే ప్రభుత్వాలు వాటిని ప్రజలకు అందకుండా హేతుబద్ధీకరణ పేరిట పట్టణాలకే పరిమితం చేయడం పట్ల ఉద్యోగులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
2005 సంవత్సరం నుంచి దాదాపు ఇరవై ఎండ్లుగా ప్రతి సామాజిక ఆరోగ్య ఆసుపత్రులలోఐసీటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసి హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ, కౌన్సిలింగ్ సేవలను అందిస్తున్నాయి. జనరల్ వ్యక్తులు, రిస్క్ ఉన్నవారు, ప్రతి గర్భిణీకి, శస్త్ర చికిత్సల సందర్భంగా హెచ్ఐవీ వ్యాధి నిర్ధారణ పరీక్షలను శిక్షణ పొందిన ల్యాబ్ టెక్నీషియన్లు మూడు దశలలో పలు టెస్ట్ కిట్లతో ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ఐసీటీసీ) లలో కన్ఫర్మేషన్ టెస్టులను నిర్వహిస్తారు. అయితే హేతుబద్దీకరణ నేపథ్యంలో పల్లెల్లోని ఐసీటీసి కేంద్రాలలో గల కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్లను ఏరియా, జిల్లా కేంద్ర ఆస్పత్రులలో గల ఐసీటీసీ కేంద్రాల్లో సర్దుబాటు చేయనున్నారు.
ఈ ప్రక్రియ వల్ల పల్లె ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కౌన్సిలింగ్ సేవలు చేరువలో లభించక రోగులు అనేక అవస్థలు అనుభవించే పరిస్థితి నెలకొననుంది. పరీక్షలకు పట్టణాల్లోని ఐసీటీసీ కేంద్రాలకు వెళ్లేందుకు రవాణ భారం పడనుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి సామాజిక ఆరోగ్య కేంద్రాలలో గల ఐసీటీసీ కేంద్రాలను యధాతధా స్థితిని కొనసాగించాలని ఉద్యోగులు, రోగులు, ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐసీటీసీ కేంద్రాలలో పనిచేస్తున్న కౌన్సిలర్లను, ల్యాబ్ టెక్నీషియన్లను జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని వివిధ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం పథకాలు అవగాహన, ప్రజా చైతన్య కార్యక్రమాలకు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
తెలంగాణల 40 కేంద్రాలు ఇవే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల మహాదేవపూర్, చిట్యాల ఆరోగ్య కేంద్రాల్లోని రెండు ఐసీటీసీ కేంద్రాలను రేషనలైజేషన్ పేరిట ఎత్తి వేయనుండడంతో ఆ జిల్లాలో హెచ్ఐవి, ఎయిడ్స్ నియంత్రణ సేవలు శూన్యం కానున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ మూడు రాష్ట్రాలకు సరిహద్దులో కాళేశ్వరం అంతర్ రాష్ట్ర త్రివేణి వంతెన మీదుగా దట్టమైన దండకారణ్య గిరిజన తాండవాసులకు మహాదేవ పూర్ ఐసీటీసీ కేంద్రం సేవలు అందిస్తున్నది. భూపాలపల్లి జిల్లా కేంద్ర ఆస్పత్రి మెడికల్ కాలేజీ గా అవతరించనున్నప్పటికీ భూపాలపల్లిలో ఐసీటీసీ కేంద్రం సేవలు అందుబాటులో లేకుండా పోతుండటం గమనార్హం.
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్, ఆదిలాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రి, మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, మందమర్రి, నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ, మర్రిగూడ, సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, మహబూబ్ నగర్ జిల్లాలో బడేపల్లి, వికారాబాద్ జిల్లాలో కొడంగల్, తాండూర్రం, రంగారెడ్డి జిల్లాలో అమంగల్, నాగర్ కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి, మెదక్ జిల్లాలో రామాయంపేట, తూప్రాన్, సంగారెడ్డి జిల్లాలో ఆందోల్, జోగిపేట్, సదాశివపేట, సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం, హయత్ నగర్, యాచారం, మార్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ, హైదరాబాద్ జిల్లాలో జంగం మెట్, ఐపిఎం నారాయణగూడ, పానీపూర, శాలిబండ, సిఆర్పిఎఫ్, ఆర్టీసీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, అంబర్ పేట్, సుల్తాన్ బజార్, లాలాపేట్, బర్కాస్, మహబూబ్బాద్ జిల్లాలో గూడూరు, వరంగల్ జిల్లాలో సికేఎం మేటర్నిటీ హాస్పటల్ లలో గల ఐసీటీసీ కేంద్రాలు ఎత్తివేత జాబితాలో ఉన్నాయి.
రేషనలైజేషన్ పేరుతో గూడుపుఠాణి
కేంద్రంలోని న్యాకో ఆదేశాలను ఆసరాగా చేసుకుని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టి-సాక్స్ ఒక ఉద్యోగి ఐసీటీసీ కేంద్రాల ఎత్తివేతలో చక్రం తిప్పినట్లు సమాచారం. వాస్తవంగా ఒక సెంటర్ కు మరో సెంటర్ కు దూరం, క్లయింట్ లోడు, పాజిటివిటీ, లింకేజీ, తదితర కారణాలను పరిగణలోకి తీసుకొని రేషనలైజేషన్ చేయడం సాధారణం. కానీ పూర్వ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జిల్లా కేంద్ర ఆసుపత్రి కి, జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో మరో ఐసీటీసీ ఉంది. రాష్ట్ర మొత్తం మీద మెడికల్ కాలేజీలలో ఐసీటీసీ కేంద్రాలను ఎత్తివేయగా, కేవలం కరీంనగర్ చలమెడ ఆనందరావు ఆసుపత్రిలోని ఐసీటీసీ కేంద్రం ఎత్తివేయకపోవడం పట్ల పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
చల్మేడ ఆసుపత్రి లో గల ఐసీటీసీ సిబ్బందికి టి. సాక్స్ లోని ఒక ఉద్యోగి సన్నిహితులు కావడంతో నిబంధనలకు తూట్లు పొడిచినట్టు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 114 కిలోమీటర్ల దూరంలో గల మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం లోని ఐసిటీసి కేంద్రాన్ని రేషనలైజేషన్ పేరిట ఎత్తివేతకు అధికారులు తీసుకున్న నిర్ణయం పలు సందేహాలకు, వివాదాస్పదానికి కేంద్ర బిందువుగా మారింది. అలాగే గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి పక్కనే ఎన్టీపీసీ ఆసుపత్రిలో మరో ఐసీటీసీ ఉంది. ఈ రెండు కేంద్రాలు పెద్ద సెంటర్లకు పక్కనే ఉన్నప్పటికీ వాటిని జిల్లా, రాష్ట్ర అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ అట్లా.. ఇక్కడ ఇట్లా..
మెడికల్ కాలేజీలలో ఐసీటీసీ కేంద్రాలను రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారులు రేషనలైజేషన్ పేరిట ఎత్తివేయడం జరుగుతుండగా, కరీంనగర్ లోని చల్మడ ఆనందరావు ఆసుపత్రిలో గల ఐసీటీసీ కేంద్రానికి ఈ నిబంధనలు వర్తించవా అని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్నలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (డ్యాప్కూ) అధికారులు సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారు. ఈ నేపధ్యంలో రేషన్లైజేషన్ వ్యవహారం వెనుక అక్రమాలు సాగాయన్న ఆరోపణలు వినిపిస్తుండగా, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.