విధాత: అంటామండీ అంటాం.. హుషారులో వంద అంటాం.. మీ కోసం పీక తెగ్గోసుకుంటాం అంటాం.. అవన్నీ నిజంగా చేస్తామా ఏందీ.. ఇక మీకూ మాకూ రామ్ రామ్.. మీదారి మీదే.. మాదారి మాదే.. ఇదీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతుదారుల మాట.
మొన్న జగన్ మీద ప్రభుత్వం మీద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విరుచుకు పడగా పలువురు కార్పొరేటర్లు ఆరోజుకు మాత్రం ఆయనకు గట్టిగా మద్దతు పలికారు. ఆరునూరైనా ఆయాన వెంటే ఉంటాం అన్నారు. ఆ తరువాత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్టీ నెల్లూరు ఇన్చార్జిగా నియమించింది.
ఆయన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి క్యాడర్ను కలుపుకు పోవడం మొదలైంది. దీంతో శ్రీధర్ రెడ్డి వెంటనున్న వారంతా ఒక్కొక్కరూ జారిపోతున్నారు. నెల్లూరు రూరల్లో కార్పొరేటర్లంతా తన వెంట నిలుస్తారని ఆయన భావించారు. అయితే అంత సీన్ లేదని ఆయనకు అర్థం అవుతోంది..
నెల్లూరు రూరల్లో మొత్తం 28 డివిజన్లున్నాయి. నెల్లూరు రూరల్ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్రెడ్డి తన కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మొత్తం 17 మంది ఆయనకు మద్దతు పలికారు. మరో ముగ్గురు నలుగురు కార్పొరేటర్లు తరువాత వచ్చి కలుస్తామన్నారట.
నెల్లూరు మేయర్ స్రవంతి రూరల్ పరిధిలోని డివిజన్ నుంచి గెలిచి కోటంరెడ్డికి విశ్వాసంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఓ సందర్భంలో ఆమె మాట్లాడుతూ కోటంరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపారు. ఇక పార్టీ వేసిన స్కెచ్తో ఎక్కువమంది కార్పొరేటర్లు కోటంరెడ్డికి దూరం జరుగుతూ వస్తున్నారు. ఫైనల్ గా చూస్తే మేయర్, మరో ముగ్గురు మాత్రమే శ్రీధర్రెడ్డికి మద్దతుగా నిలుస్తారని ప్రచారం జరుగుతోంది.
మిగిలిన వారంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అనుకూలంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కోటంరెడ్డిని రాజకీయంగా ఒంటరి చేయడంలో వైసీపీ సక్సెస్ అయిందని అంటున్నారు. ఆయన మీద కేసులు పెట్టడంతో బాటు ఆయన్ను పూర్తిగా ఇబ్బంది పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ ప్రభుత్వం ఖచ్చితంగా వినియోగించుకుని ఒంటరిని చేస్తుందని అంటున్నారు.