'పేట' కాంగ్రెస్లో వర్గపోరు.. విధాత: సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఆర్.దామోదర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మధ్య సాగుతున్న వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. వచ్చే ఎన్నికల్లో సూర్యాపేట నుండి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న పటేల్ రమేష్ రెడ్డి, ఆర్.దామోదర్ రెడ్డి మధ్య వర్గపోరు సాగుతున్నది. ఈ రచ్చతో BRS నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జి.జగదీష్ రెడ్డిని ఓడించాలన్న కాంగ్రెస్ లక్ష్యం మరోసారి ఎండమావులా కనిపిస్తుంది. దామోదర్ […]
‘పేట’ కాంగ్రెస్లో వర్గపోరు..
విధాత: సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఆర్.దామోదర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మధ్య సాగుతున్న వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. వచ్చే ఎన్నికల్లో సూర్యాపేట నుండి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న పటేల్ రమేష్ రెడ్డి, ఆర్.దామోదర్ రెడ్డి మధ్య వర్గపోరు సాగుతున్నది. ఈ రచ్చతో BRS నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జి.జగదీష్ రెడ్డిని ఓడించాలన్న కాంగ్రెస్ లక్ష్యం మరోసారి ఎండమావులా కనిపిస్తుంది.
దామోదర్ రెడ్డి చేపట్టే కార్యక్రమాలకు పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు దూరంగా ఉండటం.. రమేష్ రెడ్డి చేపట్టే కార్యక్రమాలకు దామోదర్ రెడ్డి వర్గీయులు గైర్హాజరవడం నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య వైరాన్ని చాటుతోంది. తాజాగా నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ, అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లో పట్టు కోసం ఈ నెల 18న నియోజకవర్గంలోని సోలిపేట నుంచి పటేల్ రమేష్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మూడో రోజుకే ఆగిపోవడం పేట కాంగ్రెస్లో వర్గ పోరుకు నిదర్శనంగా నిలిచింది.
రమేష్ రెడ్డి పాదయాత్రకు దామోదర్ రెడ్డి వర్గీయులు ఎప్పటిలాగానే దూరంగా ఉన్నారు. పటేల్ పాదయాత్ర రెండో రోజు రామారం గ్రామానికి చేరుకోగా మూడో రోజు అక్కడి నుండి పాదయాత్ర ప్రారంభం అవుతుందనుకున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో రమేష్ రెడ్డి పాదయాత్రను అర్ధాంతరంగా బంద్ పెట్టాల్సి వచ్చింది.
పటేల్ పాదయాత్ర పట్ల దామోదర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన పాదయాత్ర నిలిపి వేసుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. రేవంత్ రెడ్డి వర్గీయుడైన పటేల్ రమేష్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ తనకు ఖాయమన్న ధీమాతో పాదయాత్రకు పూనుకున్నారు. దామోదర్ రెడ్డి సైతం పార్టీ టికెట్ కోసం మరోసారి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరూ కూడా ఎవరకి వారు పేట కాంగ్రెస్ టికెట్ పై పట్టుదలతో ఉన్నారు.
టికెట్ పై నమ్మకంతో పటేల్ రమేష్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను నిలిపివేయాలని పార్టీ రాష్ట్ర హై కమాండ్ ఆదేశాలతో నియోజకవర్గ రాజకీయాల్లో దామోదర్ రెడ్డి దే పై చేయి అయ్యిందని, వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఆయనదేనని దామన్న వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో పాదయాత్రలు ఉన్నందునా.. ఇంతలోనే ప్రత్యేకంగా వేరే పాదయాత్రలు అవసరం లేదని భావించినందునే రాష్ట్ర నాయకత్వం దామోదర్ రెడ్డి ఒత్తిడి నేపథ్యంలో రమేష్ రెడ్డి పాదయాత్రకు బ్రేక్ వేసినట్లు తెలుస్తుంది.
రాష్ట్ర కాంగ్రెస్లో రేవంత్ వర్గీయులకు, సీనియర్లకు సాగుతున్న వర్గపోరును రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే ఒకవైపు చక్కబెడుతున్నప్పటికీ నియోజకవర్గాల్లో మాత్రం టికెట్ల పంచాయితీ నేపథ్యంలో నాయకుల మధ్య వర్గపోరు రచ్చ కెక్కడం మాత్రం ఆగడం లేదు.
కాంగ్రెస్ నాయకులలో అనైక్యత ఇదే రీతిన కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లోనూ గత ఎన్నికల ఫలితాలే పునరావృతం కాక తప్పదన్న ఆందోళన కేడర్లో వినిపిస్తుంది. ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు, కాంగ్రెస్తో పాటు బలమైన పోటీదారుగా ఉండటంతో ఎన్నికల్లో ముక్కోణపు పోటీ సాగుతుండటం మంత్రికి అదనపు బలంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా పురోగమిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డిని ఓడించాలన్న కాంగ్రెస్ లక్ష్యం దామన్న, రమేష్ రెడ్డిల వర్గపోరు గండికొడుతుండగా, ముక్కోణపు పోటీలో బీజేపీ వెనుకబడి పోతుంది. దీంతో మరోసారి వచ్చే ఎన్నికల్లో జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం ఖాయమన్న ధీమాకు నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ వర్గాలు ఓ అంచనాకు వచ్చేస్తున్నాయి.