శ‌రీర‌మంతా రామనామ‌మే!

సాధార‌ణంగా భ‌క్తులు త‌మ కోరిక‌లు తీర్చాల‌ని దేవుళ్ల‌కు ముడుపులు క‌డుతుంటారు. మ‌రికొంద‌రు రాముడి పేరును కోటిసార్లు (రామ కోటి) రాస్తుంటారు

  • Publish Date - January 22, 2024 / 06:43 AM IST
  • అంత‌టా పచ్చ‌బొట్లు పొడిపించుకొనే
  • ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన రామనామీలు
  • 150 సంవ‌త్స‌రాలుగా సంప్ర‌దాయాన్ని
  • కొన‌సాగిస్తున్న ‘రామనామీ సమాజ్’


విధాత‌: సాధార‌ణంగా భ‌క్తులు త‌మ కోరిక‌లు తీర్చాల‌ని దేవుళ్ల‌కు ముడుపులు క‌డుతుంటారు. మ‌రికొంద‌రు రాముడి పేరును కోటిసార్లు (రామ కోటి) రాస్తుంటారు. కానీ, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన ఒక స‌మాజాం త‌మ శ‌రీర‌మంతా రామ‌నామంతో ప‌చ్చ‌బొట్లు పొడిపించుకుంటారు. త‌ల‌, ముఖంతోపాటు శ‌రీర‌మంతా క‌ఠిన‌మైన చెక్క‌సూదితో ప‌చ్చ‌బొట్లు పొడిపించుకున్నాడు.


అలా ప‌చ్చ‌బొట్లు పొడిపించుకొని శ్రీ‌రాముడిని ప్రార్థించ‌డం వారి సంప్ర‌దాయం. 150 ఏండ్లుగా ద‌ళితులైన‌ రామనామి సమాజ్ ప్ర‌జ‌లు ఈ సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తున్నారు. వీరు శ్రీ‌రాముడి అనుచ‌రులుగా పేరుగాంచారు. రాముడి ప‌ట్ల తమ భక్తిని ప్రదర్శించేందుకు శ్రీ‌రామ అని పచ్చబొట్లు వేసుకుంటారు.


రాయ్‌పూర్‌కు 180 కిలోమీటర్ల దూరంలోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలోని జైజైపూర్‌లో తమ మతపరమైన ఉత్సవాలను రామనామీలు ఇటీవ‌లే నిర్వ‌హించారు. జైజైపూర్ వద్ద మహానది నది ఒడ్డున భక్తి పాటలు, శ్లోకాలతో జాతర నిర్వ‌హించారు.


భారతదేశంలో ప్రబలంగా ఉన్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా శాంతియుత ప్రతిఘటన ఉద్యమంగా 19వ శతాబ్దంలో మధ్య, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో రామనామీ సమాజ్ ఉద్భవించింది. శతాబ్దం క్రితం ఈ శాఖ సభ్యులు తమ శరీరాలు, ముఖాలపై రామ్ పేరును పచ్చబొట్టు వేసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఈ చర్య వ‌ల్ల శ్రీ‌రాముడు స‌ర్వంత‌ర్యామి, అంద‌రివాడు అనేది వారి నమ్మకం.


“మా క‌చ్చిత‌మైన‌ సమాచారం ప్రకారం.. మా పూర్వీకులు దాదాపు 150 సంవత్సరాల క్రితం అయోధ్యలో శ్రీరామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన శుక్ల పక్షం11వ‌, 13వ‌ రోజుల మధ్య జ‌రుగుతుంద‌ని అంచనా వేశారు. అంటే జనవరి 22. మా పండుగ కూడా అదే రోజు వస్తుంది” అని జైజైపూర్ ఉత్సవానికి హాజరైన భక్తుడు మన్హరన్ రామనామి తెలిపారు.


శరీరంలోని ప్రతి భాగంలో రామ‌నామం రాసుకోవ‌డం వ‌ల్ల వారు మాంసాహారం ముట్ట‌రు. మద్యం సేవించ‌రు. త‌మ శ‌రీరం కలుషితం చేయకూడదని, పాడుచేయకూడదని రామ‌నామీలు ఈ నిర్ణయించుకున్నారు. “రాముడు అన్ని కులాలకు అతీతుడు. మేము శరీరాన్ని రామాలయంగా పరిగణిస్తాం. కాబట్టి, రామనామీలు మాంసం, మద్యపానానికి ఖచ్చితంగా దూరంగా ఉంటారు” అని మన్హరన్ రామనామి పేర్కొన్నారు.


వారు లింగ సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తారు. నెమలి ఈకలతో రూపొందించిన ‘ఘుంగ్రూస్‌, కిరీటంతో తమను తాము అలంకరించుకుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో ‘ఘుంగ్రూస్’ వారి నృత్యాలు, భజన ప్రదర్శనల్లో కీలక పాత్ర పోషిస్తారు. సనాతన హిందూ మతం నుంచి వేరుగా రామనామిలు నిరాకార దైవిక అస్తిత్వాన్ని విశ్వసిస్తారు.


శ్రీ‌రాముడిని ‘ఒకే ఒక్క నిజమైన దేవుడు’గా ఆరాధిస్తారు. తమ భక్తికి నిదర్శనంగా ఆయన పేరును తమ శరీరాలపై రాసుకుంటారు. పచ్చబొట్టు ప్రక్రియను సీనియర్ రామ్‌నామీలు చేతుల‌తో వేస్తారు. ఇందుకు రెండు చెక్క సూదులను ఉపయోగిస్తారు. ఇది తీవ్రమైన నొప్పిని క‌లిగిస్తుంది. మ‌ట్టిలోని సిరాను వాడి కిరోసిన్ పోసి కాల్చడం ద్వారా ప‌చ్చ‌బొట్లు చిర‌కాలం ఉంటాయి.