Telangana
విధాత: వ్యవసాయ రుణ మాఫీ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులు విడుదల చేయకుండా కేంద్రం ప్రభుత్వం తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు.. తదితర కారణాల వల్ల ఆర్థికలోటుతో కొంత ఆలస్యమైందని కేసీఆర్ తెలిపారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న నేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్లో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ కొనసాగించినం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాలు, కేంద్రం ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం జాప్యం జరిగింది. రైతులకు అందించాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో నిరాఘటంగా కొనసాగిస్తూనే వస్తున్నది. మీము ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, ఆరు నూరయినా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు, వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు’ అని స్పష్టం చేశారు.
19వేల కోట్లు పెండింగ్
ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 3 వ తేదీనుంచి పున: ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును, కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెల పదిహేను రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.