-అనూహ్య నిర్ణయంపై వివరణ ఇచ్చిన గౌతమ్ అదానీ విధాత: మార్కెట్ ఒడిదుడుకుల కారణంగానే ఎఫ్పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్)ను ఉపసంహరించుకున్నామని అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ గురువారం స్పష్టం చేశారు. ఈ మేరకు మదుపరులనుద్దేశిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పూర్తిగా సబ్స్క్రైబ్ అయినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం.. ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేసి ఉంటుందన్నారు. అయినప్పటికీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఎఫ్పీవోను రద్దు చేయాలని అదానీ బోర్డు నిర్ణయించినట్టు వివరించారు. ఈ […]
-అనూహ్య నిర్ణయంపై వివరణ ఇచ్చిన గౌతమ్ అదానీ
విధాత: మార్కెట్ ఒడిదుడుకుల కారణంగానే ఎఫ్పీవో (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్)ను ఉపసంహరించుకున్నామని అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ గురువారం స్పష్టం చేశారు. ఈ మేరకు మదుపరులనుద్దేశిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పూర్తిగా సబ్స్క్రైబ్ అయినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం.. ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేసి ఉంటుందన్నారు.
అయినప్పటికీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఎఫ్పీవోను రద్దు చేయాలని అదానీ బోర్డు నిర్ణయించినట్టు వివరించారు. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ మూలాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయని చెప్పారు. మార్కెట్లో మళ్లీ స్థిరత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు, నిధుల సమీకరణల వ్యూహంపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇక నాలుగు దశాబ్దాలకుపైగా ఉన్న తన వ్యాపార, పారిశ్రామిక జీవితంలో అందరి నుంచీ ఎంతో మద్దతును అందుకున్నానని, ముఖ్యంగా మదుపరులు తనను నమ్మి తనతో ఉన్నారని, అందువల్లే నా ఈ ఎదుగుదల అంటూ చెప్పుకొచ్చారు. మదుపరుల ప్రయోజనాలు తప్ప తనకు ఇంకేమీ ముఖ్యం కాదని, అందుకే ఈ ఎఫ్పీవోను కూడా రద్దు చేశామని వివరించారు.
అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయంటూ అమెరికా ఇన్వెస్టింగ్ రిసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఉన్నదాని కంటే ఎక్కువ విలువను అదానీ కంపెనీలకు చూపుతున్నారని గత వారం విడుదల చేసిన తమ నివేదికలో చెప్పింది. ఈ క్రమంలోనే గడిచిన వారం రోజుల్లో ఏకంగా 104 బిలియన్ డాలర్లకుపైగానే అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ హరించుకుపోయింది.