Bharat Jodo Yatra |
విధాత, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జరిగి ఏడాది అయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేడు సెప్టెంబర్ 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులంతా సంబురాలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు సాయంత్రం 4 గంటలకు సోమజిగూడా రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన చేయనున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. అలాగే అక్కడ సభ నిర్వహించి నాయకులు ప్రసంగిచనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.
ఎల్బీనగర్లో పాదయాత్ర చేసిన మధుయాష్కీ గౌడ్
హత్ సే హత్ జొడో యాత్ర ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ లోని సరూర్ నగర్ అంబేద్కర్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఎన్టీఆర్ నగర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహం వరకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పాదయాత్ర చేపట్టారు.
సంగారెడ్డిలో జాతీయ జెండాలతో నిర్మలాజగ్గారెడ్డి ర్యాలీ
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలజగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పట్టణ పూర వీధుల్లో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణంలోని ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, మాజీ టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంతకిషన్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.