Pawan Kalyan
విధాత: సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. జైలులో చంద్రబాబును ములాఖత్ లో కలిసి పరామర్శించనున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయనకు బహిరంగంగా తన మద్ధతును తెలిపిన పవన్ అరెస్టు రోజున చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో పవన్ ప్రయత్నాలు ఫలించలేదు. గురువారం ములాఖత్ లో బాబును పరామర్శించి ఆయనకు పవన్ తన సంఘీభావాన్ని తెలుపనున్నారు.
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్తో పాటు చంద్రబాబు ఇతర కేసులను ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులో, అటు ఏపీ హైకోర్టులో వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ద లూథ్రా బుధవారం సాయంంత్రం రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య కోర్టులో కేసుల పురోగతి, పరిణామాలపై చర్చించినట్లుగా సమాచారం. అంతకుముందు ఆయన బాబు సతీమణి భువనేశ్వరిని కలిశారు.
కాగా స్కిల్ స్కాం కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబు తరుపు న్యాయవాది సిద్దార్ధ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైందని గురుగోవింద్ సింగ్ వ్యాఖ్యలను కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ రోజు ఇదే మా నినాదం అని ఆయన పేర్కోన్నారు. దీనిపై స్పందించిన మెజార్టీ నెటిజన్లు మీరే గెలుస్తారంటూ రీట్వీట్లతో కామెంట్లు పెడుతున్నారు.
Motto for the day pic.twitter.com/gh0VsVYm8G
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 13, 2023
అయితే చంద్రబాబు కేసుల్లో తన వాదనలు వీగిపోతుండటం..ప్రతికూల తీర్పులు వెలువడటం ఆయనలో నెలకొన్న అసహానానికి నిదర్శనంగా లూథ్రా ట్వీట్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
లోకేశ్కు రజనీకాంత్ ఫోన్
చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో తమిళ సూపర్ స్టార్ నటుడు రజనీకాంత్ బుధవారం లోకేశ్ కు ఫోన్ చేసి పరామర్శించారు. తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనను ఏమి చేయలేవన్నారు. ధైర్యంగా ఉండాలని లోకేశ్ కు రజనీకాంత్ సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్ధమైన ప్రజాసేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయన్నారు.