ఓ కీలక నేతకు కాంగ్రెస్ గాలం? పూర్వ వైభవం కోసం హస్తంలో ఆరాటం BJP | విధాత ప్రతినిధి, నిజామాబాద్: ఆర్మూర్ (Armour) నియోజకవర్గంలో శాసన సభ ఎన్నికల రాజకీయ వేడి రాజుకుంటోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీలో గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కేలా కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే బీజేపీ నేత వినయ్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ వచ్చే […]
BJP |
విధాత ప్రతినిధి, నిజామాబాద్: ఆర్మూర్ (Armour) నియోజకవర్గంలో శాసన సభ ఎన్నికల రాజకీయ వేడి రాజుకుంటోంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీలో గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కేలా కనిపిస్తున్నాయి.
ఈ కారణంగానే బీజేపీ నేత వినయ్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
అరవింద్ (Arvind) ఇప్పటికే క్యాంప్ ఆఫీసును నిజామాబాద్ నుంచి ఆర్మూర్ కు మార్చారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, తనకు టికెట్ రాదనే ఉద్దేశంతో వినయ్ బీజేపీకి గుడ్ బై చెప్పారని భావిస్తున్నారు. పారిశ్రామికవేత్త పైడి రాకేష్ రెడ్డిని.. అరవింద్ పార్టీలో చేర్పించారు. అతన్ని బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి అంటూ పైకి ప్రచారం చేస్తున్నా.. తెరవెనుక మాత్రం అరవింద్ ఈ తతంగం నడిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వినయ్ కాంగ్రెస్ లో చేరితే..?
బీజేపీ నేత వినయ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే, ఆర్మూర్ లో హస్తం పార్టీకి బిగ్ బూస్టింగ్ వచ్చినట్టే భావించొచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆర్మూర్ లో.. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆకుల లలిత, అంతకు ముందు పోటీ చేసిన మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.
దీంతో అధికార పార్టీ ఇక్కడ మరింత బలపడగా.. కాంగ్రెస్ బలహీనమైంది. గత కొంత కాలంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుండగా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతల మధ్య పోటీ ఉంది.
కానీ ఆర్మూర్ లో మాత్రం సరైన అభ్యర్థి లేని పరిస్థితి. ఇక్కడ కేడర్ బలంగా ఉన్నప్పటికీ.. దిశానిర్దేశం చేసే నాయకులు కరువయ్యారు. దీంతో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన వినయ్ రెడ్డి దాదాపు 20 వేల ఓట్లు సాధించారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ తరఫున ఎక్కువ ఓట్లు పడింది కూడా ఆయనకే. ఆయన కాంగ్రెస్ లో చేరితే ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపు బీజేపీ ఖాళీ అవుతుంది అనే చెప్పాలి.
నియోజకవర్గంలో బీజేపీకి ఆది నుండి వినయ్ కుమార్ అన్నీ తానే నడిపిస్తూ కార్యకర్తలు, నాయకులను కాపాడుకుంటూ అహర్నిశలు కష్టపడుతూ వారికి భరోసా ఇచ్చారు. ముందుగా కాంగ్రెస్ పార్టీతో ఆర్మూర్ టికెట్ ఖాయం చేసుకున్న తర్వాతే వినయ్ కుమార్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
దీంతో రేపో, మాపో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అంతేకాకుండా నిన్నటి దాకా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్న ఆర్మూర్ సెగ్మెంట్లో.. కాంగ్రెస్ పార్టీ బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి రైతు దీక్ష చేపట్టిన తర్వాత ఆర్మూర్ లో కాంగ్రెస్ పెద్దగా కార్యక్రమాలేవీ చేపట్టలేదు. దీంతో పార్టీ కేడర్ అసంతృప్తితో ఉంది.
టీడీపీ ఆవిర్భావం వరకూ కాంగ్రెస్ హవానే..
1952 లో ఆర్మూర్ నియోజకవర్గం ఏర్పాటైంది. టీడీపీ ఆవిర్భావం వరకూ ఇక్కడ కాంగ్రెస్ హవానే కొనసాగింది. ఆ తర్వాత టీడీపీ సత్తా చాటింది. 2014, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి వరుసగా విజయం సాధించారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆయన తహతహలాడుతున్నారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలను కూడా జీవన్ రెడ్డికి కట్టబెట్టిన బీఆర్ఎస్ అధిష్టానం ఆయనపై పూర్తి విశ్వాసంతో ఉంది.
ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, పార్టీని ముందుకు నడిపే నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారు. వినయ్ కుమార్ లాంటి నాయకులు కాంగ్రెస్ లో చేరి పార్టీని ముందు నడిపిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతోంది.