Vande Bharat | ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లను మరికొన్ని రూట్లలో ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే కసరత్తులు చేస్తున్నది. త్వరలో దేశవ్యాప్తంగా పది కొత్త రైళ్లను పట్టాలెక్కించనుండగా.. ఇందులో నాలుగు తెలుగు రాష్ట్రాలకు చెందినవి కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇందులో మూడు హైదరాబాద్ నుంచి పరుగులు పెట్టనున్నాయి. ఇందులో కాచిగూడ - యశ్వంత్పూర్-కాచిగూడ, సికింద్రాబాద్ - పుణే - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - నాగ్పూర్ - సికింద్రాబాద్ ఉండగా.. మరొకటి ఏపీలోని విజయవాడ - […]
Vande Bharat |
ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లను మరికొన్ని రూట్లలో ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే కసరత్తులు చేస్తున్నది. త్వరలో దేశవ్యాప్తంగా పది కొత్త రైళ్లను పట్టాలెక్కించనుండగా.. ఇందులో నాలుగు తెలుగు రాష్ట్రాలకు చెందినవి కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇందులో మూడు హైదరాబాద్ నుంచి పరుగులు పెట్టనున్నాయి.
ఇందులో కాచిగూడ – యశ్వంత్పూర్-కాచిగూడ, సికింద్రాబాద్ – పుణే – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – నాగ్పూర్ – సికింద్రాబాద్ ఉండగా.. మరొకటి ఏపీలోని విజయవాడ – చెన్నై – విజయవాడ మార్గాల్లో తిరగనున్నాయి. అయితే, ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ – యశ్వంత్పూర్, సికింద్రాబాద్ – పుణే రూట్లో ట్రయల్ రన్ నిర్వహించింది. ప్రస్తుతం సికింద్రాబాద్ – పుణే మార్గంలో శతాబ్ది రైలు ఉండగా.. దాని స్థానంలో వందే భారత్ రైలును రీప్లేస్ చేయనున్నది.
అలాగే విజయవాడ – చెన్నై మార్గంలోనూ వందే భారత్ రైలు రాబోతున్నది. తిరుపతి నుంచి వెళ్లనుండగా.. శ్రీవారి భక్తులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగడపనున్నది. త్వరలోనే ఈ నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్, విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం రూట్లో వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. త్వరలో నాలుగు ప్రారంభంకానుండగా.. ఈ సంఖ్య ఆరుకు చేరుకోనున్నది. వాస్తవానికి కాచిగూడ – యశ్వంత్పూర్ రైలు ఇప్పటికే ప్రారంభంకావాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఇప్పటికే రైలుకు సంబంధించి రూట్, టైమింగ్స్, టికెట్ల ధరలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సికింద్రాబాద్ నుంచి కర్నాటకలోని బెంగళూరుకు ఇప్పటికే ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా రైళ్లలో ప్రయాణ సమయం 10-12 గంటలుపడుతున్నది. వందేభారత్ రైలు ప్రారంభమైతే కేవలం 7.30 గంటల నుంచి 8.30 గంటల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ రైలు ఉదయం 6 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 2.30 గంటలకు యశ్వంత్పూర్ చేరుకుంటుంది.
మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్ – పుణే మార్గంలో శబాద్ది రైలును రీప్లేస్ చేయనుండగా.. వందే భారత్ అందుబాటులోకి వస్తే 8.30 గంటల్లోనే పుణేకు చేరుకునే అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్ – నాగ్పూర్ మధ్య రైలు అందుబాటులోకి వస్తే కేవలం 7 గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.