విధాత: వివిధ సామాజిక వర్గాల వారికి తెలంగాణలో ఆత్మగౌరవం లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం ఇందిరా భవన్లో అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ మాట్లాడుతూ వివిధ సామాజిక వర్గాల వారు ఆత్మగౌరవంతో బతకాలని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు.
అయితే ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో కులవృత్తులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని తెలిపారు. మత్స్యకార సంఘాలు చేప పిల్లల పంపిణీకి పనికిరావా? అని నిలదీశారు. చేప పిల్లల పంపిణీని ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగిస్తోందన్నారు. నాసిరకం చేప పిల్లలు పంపిణీ చేసి కొందరు పెద్దలు దోచుకుంటున్నారని, వీటిపై ప్రభుత్వం విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రైతులకు అందించినట్లే మత్య్సకారులకు కూడా 5లక్షల బీమా పథకం అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత్య్సకారులను బీసీ డి నుంచి బీసీ ఏ గ్రూపులో చేర్చేలా కృషి చేస్తామన్నారు. మత్స్యకారుల సంక్షేమంపై సూచనలు ఇస్తే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు.
మత్స్యకారులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మెట్టు సాయి కుమార్ అధ్యక్షత వహించగా మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.