Night Shift Side Effects | మారుతున్న లైఫ్స్టైల్.. కార్పొరేట్ ఉద్యోగాల పెరుగుదలతో ఇప్పుడు నైట్షిఫ్ట్లు కామన్ అయిపోయాయి. ఇష్టమున్న లేకున్నా ఇప్పుడు రాత్రిపూట పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంపాదన అవసరమై ఈ నైట్షిఫ్ట్లు చేస్తున్నప్పటికీ ఇది దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిద్రలేమి.. అతిపెద్ద సమస్య!
ముఖ్యంగా నైట్షిఫ్ట్ చేసే వారిలో నిద్రలేమి సమస్య ప్రధానంగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా మన శరీరం ఉదయం పూట పనిచేయడానికి, రాత్రిపూట నిద్రపోవడానికి అలవాటు పడింది. కానీ రాత్రిపూట పనిచేయడం వల్ల ఈ సైకిల్ పూర్తిగా మారిపోతుంది. పగటిపూట సరిగ్గా నిద్రపట్టదు. దీనివల్ల శరీరానికి సరైన విశ్రాంతి దొరకదు. దీంతో అలసట, తలనొప్పి, దృష్టిలోపం వంటి సమస్యలు వస్తాయి.
క్యాన్సర్ ప్రమాదమూ!
నైట్ షిఫ్ట్లతో క్యాన్సర్ ముప్పు కూడా ఉందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు తెలిపాయి. అయితే ఇది ప్రత్యక్ష కారణం కాదని.. కాకపోతే నైట్షిఫ్ట్ల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తి.. అవి రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మానసిక ఆరోగ్యంపైనా ఎఫెక్ట్
నైట్షిఫ్ట్ల్లో పనిచేసే వారు తమ కుటుంబం, స్నేహితులకు సమయం కేటాయించలేకపోతుంటారు. దీనివల్ల ఒంటరితనం పెరుగుతుంది. పైగా నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. కాబట్టి వీటన్నింటి వల్ల డిప్రెషన్కు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిరంతర ఒత్తిడి వల్ల మానసిక అలసట కూడా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గుండెకు ముప్పు
రాత్రిపూట మేల్కొని ఉండటం ల్ల శరీరంలోని సహజ జీవక్రియలు దెబ్బతింటాయి. రక్తప్రసరణ జరిగ్గా జరకపోవడం, ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతాయి. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
విటమిన్ డి లోపం
నైట్షిఫ్ట్లో పనిచేసే వారు రాత్రి పూట పనిచేసి, ఉదయం పడుకుంటారు. అంటే పగటిపూట ఎక్కువగా బయటతిరగరు. దీంతో శరీరానికి సూర్యరశ్మి తక్కువ అందుతుంది. ఫలితంగా విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఈ లోపం కారణంగా ఎముకల బలహీనత నుంచి ఇమ్యూనిటీ తగ్గుదల వరకు పలు సమస్యలు తలెత్తుతాయి. జీవక్రియల అసమతుల్యత కారణంగా డయాబెటిస్, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఆర్థిక సమస్యల కారణంగా కొందరికి నైట్షిఫ్ట్లు మానేయడం సాధ్యం కాదు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డ్యూటీ పూర్తికాగానే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. రోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని సమయానికి తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని సలహానిస్తున్నారు. కాఫీ, టీ వంటి పానీయాలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.
Read More:
జ్ఞాపకశక్తిని ఇలా పెంచుకోండి.. డిమెన్షియా, అల్జీమర్స్ రోగులకు సైంటిస్టుల సూచనలు
ఆందోళన తగ్గించే 5 సులభ చిట్కాలు
