ఏపీలో కొత్తమంత్రి వర్గం కొలువుదీరింది. శుక్రవారం నుంచి ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాలు మొదలయ్యాయి. గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేక సాధారణ ఎమ్మెల్యే తరహాలో అసెంబ్లీలో కూర్చొంటుండగా.. ఇక కొత్త ప్రభుత్వ పాలన ఏపీలో కొనసాగనున్నది.
ముఖ్యమంత్రి రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతున్నది?
సొంతగా మెజార్టీ దక్కించుకోలేక పోయిన బీజేపీ
గతంలో అనేక పార్టీలను, మిత్రపక్షాలను చీల్చిన చరిత్ర
మోదీ, షా రాజకీయాల పట్ల బాబు అప్రమత్తంగా ఉండాలంటున్న విశ్లేషకులు
న్యూఢిల్లీ : ఏపీలో కొత్తమంత్రి వర్గం కొలువుదీరింది. శుక్రవారం నుంచి ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాలు మొదలయ్యాయి. గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేక సాధారణ ఎమ్మెల్యే తరహాలో అసెంబ్లీలో కూర్చొంటుండగా.. ఇక కొత్త ప్రభుత్వ పాలన ఏపీలో కొనసాగనున్నది. ఇదే ప్రభుత్వం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉంటున్నది. అయితే.. రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకునే దిశగా వాజ్పేయి హయాంలో మాదిరిగా చంద్రబాబుకు లేదా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్కు చక్రం తిప్పే అవకాశాలు ఉంటాయా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రధాని నుంచి గట్టి ఆలింగనం అందింది. అది ఆలింగనమేనా? లేక దృతరాష్ట్ర కౌగిలా? అనేది రానున్న రోజుల్లో నడిచే రాజకీయాలు నిరూపించనున్నాయి. మోదీ హృదయపూర్వకంగానే తనను ఆలింగనం చేసుకున్నారనే అభిప్రాయంతో చంద్రబాబు ఉంటారని, లేదా దేశవ్యాప్తంగా తనకు తగ్గిన ప్రాభవం నేపథ్యంలో తన పాత స్వభావాలను మార్చుకుని, సుద్దపూసగా మారిపోయాననే సంకేతాన్ని మోదీ ఇచ్చినట్టుగానీ కచ్చితంగా చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి మోదీ, అమిత్షా రాజకీయ చదరంగం ఎలా ఉంటుందనే విషయం చంద్రబాబుకు స్వీయానుభవమే ఉన్నది. ఎన్నికలకు ముందు తనపై క్రిమినల్ కేసు మోపడంలో ఈడీ పోషించిన కీలక పాత్రను చంద్రబాబు మర్చిపోతారని కూడా చెప్పలేమని అంటున్నారు. ఆ కేసు కారణంగానే చంద్రబాబు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కానీ.. అదే జైలు జీవితం చంద్రబాబుకు విశేష జనాదరణను మళ్లీ తెచ్చిపెటింది. అప్పటిదాకా తనకు వివాదాస్పద బిల్లుల ఆమోదంలో పరోక్షంగా మద్దతు ఇస్తూ వచ్చిన జగన్ మోహన్రెడ్డిని కాదని చంద్రబాబును మోదీ, షా తమ భాగస్వామిని చేసుకున్నారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో జగన్పై మోదీ తీవ్రస్థాయి విమర్శలు చేసిన సందర్భాలు కూడా లేవు. ఎన్నికల తర్వాత పరిస్థితి ఎటు పోయి ఎటు వస్తుందోనన్న అనుమానంతోనే మోదీ అటు జగన్ను కూడా ఆప్షన్గానే ఉంచుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికలు జరిగే నాటికి జగన్ పార్టీ గట్టిపోటీనే ఇస్తున్నదనే వాదనలు ఉండటం కూడా ఇందుకు ఒక కారణంగా భావించారు.
ఇప్పుడు చంద్రబాబు అటు అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటు లోక్సభ ఎన్నికల్లో స్వీప్ చేసిన నేపథ్యంలో చంద్రబాబును మోదీ ‘ఆలింగనం’ చేసుకోవడానికి ఇబ్బంది పడలేదు. ఇక జగన్పై వరుస కేసులు నమోదవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనను ఐదేళ్లుగా నానా హింసలు పెట్టిన గత ముఖ్యమంత్రిపై చంద్రబాబు ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటారని చెప్పలేం. అదే సమయంలో మోదీ, షా విభజించి పాలించే రాజకీయాల పట్ల కూడా చంద్రబాబు అవగాహనతోనే ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. మోదీ గత పాలనపై చంద్రబాబుకు విస్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయనేది ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నది. ఇప్పుడు జనం మోదీలో మార్పు కోరుతూ ఇచ్చిన తీర్పు తర్వాత ఆయన మారుతారా? అనేది ఒక ప్రశ్న. ఆనాడు మోదీ పాలన గురించి చంద్రబాబు వ్యాఖ్యలను ఒకసారి గమనిస్తే.. ‘భారతదేశ ప్రతిష్ఠాత్మక సంస్థలను మోదీ పద్ధతి ప్రకారం ధ్వంసం చేశారు. బీజేపీ పాలనలో స్వతంత్ర సంస్థలు, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయి’ అని చెప్పారు. మోదీతో వ్యవహారాలు చేసే సమయంలో చంద్రబాబు ఈ మాటలను బాగా గుర్తు పెట్టుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ.. కొంపలేమీ మునిగిపోలేదన్న పద్ధతిలో మోదీ, షా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. తమ పాత విధానాలనే కొనసాగించే దారిలోనే ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు జాగ్రత్తగా ఉండకపోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎందుకంటే ఇదే టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులను బీజేపీ గుంజుకున్నది. మహారాష్ట్రలో తన మిత్రపక్షమైన శివసేను చీల్చింది. ఒడిశాలో బిజు జనతాదళ్ను, బీహార్లో జేడీయూను, తమిళనాడులో అన్నాడీఎంకేను చీల్చింది. మెజార్టీ ఉన్న సమయంలోనే ఈ పనులు చేసిన మోదీ, షా.. బీజేపీకి సంఖ్యాబలం తక్కువగా ఉన్న సమయంలో మళ్లీ పాత కుట్ర కత్తులను బయటకు తీసే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, ఆయన కీలక భాగస్వామి పవన్ కల్యాణ్ సైతం వీటిని గమనంలో ఉంచుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.