Maharashtra | బావిలో ప‌డ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

Maharashtra | ఓ ఫంక్ష‌న్‌కు హాజ‌రై ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్ర‌మాదానికి బ‌లైంది. రోడ్డు ప‌క్క‌నే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్ల‌డంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • By: raj |    national |    Published on : Apr 04, 2026 10:12 AM IST
Maharashtra | బావిలో ప‌డ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

Maharashtra | ఓ ఫంక్ష‌న్‌కు హాజ‌రై ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్ర‌మాదానికి బ‌లైంది. రోడ్డు ప‌క్క‌నే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్ల‌డంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని నాసిక్ జిల్లాలో శుక్ర‌వారం రాత్రి చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. నాసిక్ జిల్లా దిండోరి తాలుకా ప‌రిధిలోని ఇండోర్ గ్రామానికి చెందిన ద‌ర్గుడే కుటుంబ స‌భ్యులు దిండోరి ప‌ట్ట‌ణంలో జ‌రిగిన ఓ ఫంక్ష‌న్‌కు శుక్ర‌వారం రాత్రి హాజ‌ర‌య్యారు. ఫంక్ష‌న్ అయిపోయాక మ‌ళ్లీ కారులో సొంతూరికి బ‌య‌ల్దేరారు. శివాజీ న‌గ‌ర్ ఏరియా స‌మీపంలో రోడ్డు ప‌క్క‌న ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్రేన్ల స‌హాయంతో కారును బ‌య‌ట‌కు తీశారు. మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు వెలికితీశారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. అతివేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు నిర్ధారించారు.

మృతుల‌ను సునీత్ ద‌త్తు ద‌ర్గుడే(32), ఆయ‌న భార్య రేష్మ‌, ఆశా అనిల్ ద‌ర్గుడే(32)గా గుర్తించారు. మిగ‌తా ఆరుగురు చిన్నారులు అని తెలిపారు. పిల్ల‌ల్లో ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు. వీరంతా ఏడు నుంచి 14 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారు కాగా, ఒక అబ్బాయి వ‌య‌సు 11 ఏండ్లు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం దిండోరి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.