అలనాటి అందాల తార శ్రీదేవి మరణం ఇప్పటికీ అంతుచిక్కకుండానే ఉన్నది. శ్రీదేవి మృతిపై తనకు లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారని ఆమె భర్త బోనీ కపూర్ ఇటీవల న్యూ ఇండియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు
ముంబై: అలనాటి అందాల తార శ్రీదేవి మరణం ఇప్పటికీ అంతుచిక్కకుండానే ఉన్నది. శ్రీదేవి మృతిపై తనకు లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారని ఆమె భర్త బోనీ కపూర్ ఇటీవల న్యూ ఇండియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దుబాయి పోలీసులు తనను 48 గంటల పాటు ఇంటరాగేట్ చేశారని చెప్పారు. శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయిలోని ఒక హోటల్లో ప్రమాదవశాత్తు బాత్టబ్లో మునిగి మరణించిన విషయం విదితమే. ‘మంచిగా కనిపించడం కోసం ఆమె తరచూ ఉపవాసాలు చేసేది. అప్పుడప్పుడు కళ్లు తిరిగి పడిపోయేది’ అని ఆయన చెప్పారు. ఆమె మరణంపై అప్పట్లో రకరకాల అనుమానాలు, కుట్ర కథనాలు వెలువడ్డాయి. ‘తను తన మంచి శరీరాకృతిని కాపాడుకోవడానికి తపించేది. స్క్రీన్పై మంచిగా కనిపించాలన్న తాపత్రం ఉండేది’ అని ఆయన చెప్పారు. తనను పెళ్లి చేసుకున్న తర్వాత రెండు మూడు సందర్భాల్లో తను కళ్లు తిరిగి పడిపోవడం జరిగిందని ఆయన చెప్పారు. ఆమెకు లోబీపీ సమస్య ఉందని డాక్టర్లు చెప్పేవారని కూడా తెలిపారు. ఆమె నిత్యం ఉప్పు లేని ఆహారమే తీసుకునే వారని చెప్పారు. ‘అది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు జరిగిన మరణం. నేను 24 లేక 48 గంటలు ఇదే అంశంపై ఇంటరాగేషన్లో మాట్లాడాను. అందుకే బయట మాట్లాడలేదు. భారత మీడియా నుంచి విపరీతంగా ఒత్తిడి ఉందని, ఇలా దర్యాప్తు చేయకతప్పడం లేదని అధికారులు చెప్పారు. లై డిటెక్టర్ పరీక్షతో సహా అన్ని పరీక్షలకూ నిలబడ్డాను. ఇందులో ఎటువంటి కుట్రా లేదని నిర్ధారణకు వచ్చారు. అది ప్రమాదవశాత్తు జరిగిందేనని నివేదిక వచ్చింది’ అని బోనీ కపూర్ చెప్పారు. శ్రీదేవి అంతకుముందు కూడా ఒక సినిమా షూటింగ్ సందర్భంగా కళ్లుతిరిగి పడిపోయినట్టు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చిన హీరో నాగార్జున చెప్పారని బోనీ కపూర్ తెలిపారు.