ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లాలో నర్మదా నది బర్గీ జలాశయంలో పడవ బోల్తా పడి తొమ్మది మంది చనిపోయిన ప్రమాద ఘటన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలతో ప్రమాదానికి ముందు బోటులో ఏం జరిగిందో ప్రపంచానికి తెలిసివచ్చింది. బోగు మునిగిపోయే కొన్ని నిమిషాల ముందు ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్న వీడియో అందరిని వేదనకు గురి చేస్తుంది. బోటులోకి నీరు వస్తుండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై సహాయం కోసం ఎదురు చూశారు. బోటు భారీ కుదుపులకు గురైన సమయంలో సిబ్బంది ప్రయాణికులకు లైఫ్‌ జాకెట్లు ఇవ్వడానికి మూటలు విప్పుతున్న దృశ్యం వీడియోలో కనిపించింది. ప్రయాణికులు బోటు ఎక్కగానే ఇవ్వాల్సిన లైఫ్‌ జాకెట్లు ఇవ్వకుండా.. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని ప్రమాదం నుంచి బయటపడిన వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో 28 మందిని రక్షించగా.. తొమ్మిది మంది మృతదేహాలను వెలికితీశారు.

వీడియోలో ప్రమాదానికి ముందు మరీనా అనే మహిళ.. తన కుమారుడు త్రిషాన్‌ను పొదివిపట్టుకొని ఉన్న దృశ్యం అందరిని కలిచివేసింది. బోటు మునిగిపోయిన అనంతరం వారి మృతదేహాలను బయటకు తీసిన సమయంలోనూ ఆమె తన బిడ్డను అలాగే పట్టుకొని ఉండడం చూపరులను కంటతడి పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఆమె భర్త ప్రాణాలతో బయటపడ్డారు.

ఆలస్యంగా వచ్చిన సహాయక బృందాలు

సాయంత్రం 6.15 గంటలకు ప్రమాదం జరిగినట్లు సహాయక బృందాలకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు 6.40 గంటల వరకు బయలుదేరలేదని బాధితులు ఆరోపించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక మత్స్యకారులు, రైతులు 15 మందికి పైగా ప్రయాణికులను రక్షించారు. అనంతరం 7గంటల సమయంలో సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే తమ వాహనం పాడవడం వల్లే ఆలస్యమైందని సహాయక సిబ్బంది పేర్కొన్నారు. మరోవైపు భారీ వర్షం కూడా సహాయక చర్యలకు ఆటంకంగా తయారైంది.

బోటింగ్ సర్వీస్ ల నిలిపివేత

బర్నీ జలాశయం బోటు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్రూయిజ్ కార్యకలాపాలు, మోటార్ బోట్ సేవలు, వాటర్ స్పోర్ట్స్‌ను నిలిపివేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. క్రూయిజ్ పైలట్ మహేష్ పటేల్, సహాయకుడు ఛోటేలాల్ గోండ్, టికెట్ కౌంటర్ ఇన్‌ఛార్జి బ్రిజేంద్రలను విధుల నుంచి తొలగించారు. బోట్ క్లబ్ మేనేజర్ సునీల్ మరావిని సస్పెండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

సుప్రీంకోర్టులో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
Firefighters | మంటలు ఆర్పడమే కాదు.. 73 శాతం వేరే పనులు కూడా.. అగ్నిమాపక సిబ్బంది అసలైన బాధ్యతలివే!

Latest News