మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాలని చూస్తున్న బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టో నమ్మదగినట్లుగా లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు
విధాత : మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాలని చూస్తున్న బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టో నమ్మదగినట్లుగా లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. బీజేపీ మ్యానిఫెస్టోపై విపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విమర్శలు గుప్పించాయి. నెరవేర్చలేని వాగ్దానాలను బీజేపీ ఇచ్చిందని ఖర్గే ఆరోపించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, పంటకు కనీస మద్దతు ధర పెంచుతామని గత పదేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, కొత్తగా ఇచ్చిన హామీలను ఎలా నమ్మేదని ప్రశ్నించారు. మోదీ ఇచ్చిన 2కోట్ల ఉద్యోగ హామీలు అమలు కాక ఉద్యోగాల కోసం యువత ఎదురు చూస్తున్నారని, ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతుందని, గత పదేళ్లలో పేదల కోసం మోదీ ప్రభుత్వం చేసిందేమి లేదని, ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని మళ్లీ మ్యానిఫెస్టోతో కొత్త హామీలిచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.
ఆప్ మంత్రి అతిషి స్పందిస్తూ ఢిల్లీ బడ్జెట్ కన్నా ఆయుష్మాన్ భారత్ బడ్జెట్ తక్కువని ఎద్దేవ చేశారు. ఢిల్లీ కోసం రూ.9 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. ఆయుష్మాన్ భారత్ కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. నేను పని చేశానని అనుకుంటే ఓటు వేయండి, లేదనుకుంటే వేయొద్దని అరవింద్ కేజ్రీవాల్ అంటారని, ఆ విధంగా మోదీ అడగలరా అని ప్రశ్నించారు. బీజేపీ మ్యానిఫెస్టో ఓ మోసపూరిత వాగ్ధానాల పత్రమని విమర్శించారు.