పశ్చిమబెంగాల్లో రామనవమి సందర్భంగా బీజేపీ హింసను ప్రేరేపించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఆరోపించారు. తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ఆ పార్టీ రక్తపాతాన్ని నమ్మకున్నదని మండిపడ్డారు
బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు
రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు
ముర్షీదాబాద్: పశ్చిమబెంగాల్లో రామనవమి సందర్భంగా బీజేపీ హింసను ప్రేరేపించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఆరోపించారు. తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ఆ పార్టీ రక్తపాతాన్ని నమ్మకున్నదని మండిపడ్డారు. ముర్షీదాబాద్ జిల్లాలోలు ముస్లింలు అధికంగా నివసించే హరిహర్పారాలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తుందని అందుకే.. 2024 లోక్సభ ఎన్నికలు దేశ రెండో స్వాతంత్ర్య పోరాటానికి తక్కువేమీ కాదని అభివర్ణించారు. రామనవమి నాడు బెంగాల్లో హింస కాషాయ కూటమి ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందేనని మమత విమర్శించారు. ముర్షీదాబాద్లోని శక్తిపూర్ ఏరియాలో బుధవారం బాంబు పేలుడు ఘటనలో ఒక మహిళ గాయపడిన సంగతి తెలిసిందే. రామ నవమి ప్రదర్శన సందర్భంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాజీనగర్ ఏరియాలో రాళ్లు రువ్వారని బీజేపీ ఆరోపిస్తున్నది. తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి బీజేపీ రక్తపాతాన్ని, హింసనే నమ్ముకున్నది. రాష్ట్రంలో హింసను రెచ్చగొడుతున్నది. కోర్టు ఆదేశాలు ధిక్కరించి, ఆయుధాలతో బీజేపీ నేతలు ఎందుకు ప్రదర్శనలు నిర్వహించారు? ఆయుధాలతో ర్యాలీలు నిర్వహించాలని వారికి ఎవరు చెప్పారు? వారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు?’ అని మమత ప్రశ్నించారు. రామనవమి ఉత్సవాల సందర్భంగా జరిగిన హింసలో 19 మంది గాయపడ్డారని ఆమె చెప్పారు. ఓట్లు కొల్లగొట్టేందుకు కేంద్ర బలగాలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని కోరారు.