Bhagawat on PoK | మన గదిని మనం స్వాధీనం చేసుకోవాలి – పీవోకేపై మోహన్‌ భాగవత్‌ సంచలన వ్యాఖ్యలు

భారత్‌ అనే ఇంట్లో పీవోకే ఒక గది అని, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. పీవోకేలో పాకిస్తాన్‌ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Bhagawat on PoK | మన గదిని మనం స్వాధీనం చేసుకోవాలి – పీవోకేపై మోహన్‌ భాగవత్‌ సంచలన వ్యాఖ్యలు

PoK Is A Room In India’s House, we’ll Take It Back: RSS Chief Mohan Bhagwat

సత్నా (మధ్యప్రదేశ్‌), అక్టోబర్‌ 5 (విధాత‌):
ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్ర స్వయంసేవక్‌ సంఘ్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK) గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. భాగవత్‌ మాట్లాడుతూ – “భారత్‌ అనే ఇంట్లో నుండి ఒక గదిని ఇతరులు ఆక్రమించుకున్నారు. నిజానికి ఆ గది మనదే. దాన్ని మనం తిరిగి తెచ్చుకోవాల్సిందే” అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు వినగానే సభ గట్టిగా చప్పట్లతో మార్మోగింది.

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో జరిగిన సభలో మాట్లాడిన మోహన్‌ భాగవత్‌ — “మన సింధీ సోదరులు ఇక్కడ కూర్చున్నారు. వాళ్లు పాకిస్తాన్‌కి వెళ్లలేదు, అవిభక్త భారతదేశానికి వెళ్లారు. పరిస్థితులు మమ్మల్ని ఆ ఇంటి నుండి ఇక్కడికి పంపించాయి ఎందుకంటే ఆ ఇల్లు, ఈ ఇల్లు వేర్వేరు కావు” అని బిజెపి సైద్ధాంతిక గురువైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధిపతి అయిన భాగవత్ అన్నారు.

భాగవత్‌ చేసిన ఈ వ్యాఖ్యలు పీవోకేలో ప్రస్తుతం నెలకొన్న అస్థిరత నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇటీవలి రోజుల్లో పీవోకేలో పాకిస్తాన్‌ పాలనకు వ్యతిరేకంగా భారీ నిరసనలు చెలరేగాయి. అవామీ యాక్షన్‌ కమిటీ (AAC) ఆధ్వర్యంలో వేలాదిమంది ప్రజలు ఆర్థిక సడలింపులు, రాజకీయ సంస్కరణలు కోరుతూ వీధుల్లోకి దిగారు. గత మూడు రోజులుగా జరిగిన హింసలో కనీసం 10 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. బాగ్‌ జిల్లా ధీర్కోట్‌లో నలుగురు నిరసనకారులను కాల్చిచంపారని, ముజఫరాబాద్‌, డడియాల్‌, కోహాలా సమీపంలోని చమ్యాతీ ప్రాంతాల నుంచీ కూడా మరణాలు నమోదయ్యాయని స్థానిక మీడియా తెలిపింది.

Police officers stand on a bridge, as they stop the protesters of the Awami Action Committee, during a protest following a shutter-down strike in Muzaffarabad, the capital of PoK

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాకిస్తాన్‌ ప్రభుత్వం చర్చలకు బదులుగా నిర్బంధ మార్గం ఎంచుకోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొన్నారు. ఈ నిరసనలతో పీవోకే ప్రజలు 1947 నుంచి ఇస్లామాబాద్‌ ప్రచారం చేస్తున్న “భారత్‌ వ్యతిరేక వాదనల”ను కొట్టిపడేసారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అలాగే పీవోకే పౌరులు గతంలో భారత్​లో కలవాలని ఆకాంక్షిస్తూ కూడా నిరసనలు చేసారు.

భాగవత్‌ ఇటీవల పహల్గాం ఉగ్రదాడి సందర్భంగా మాట్లాడుతూ — “భారత్‌ మిత్ర దేశాలు ఎంతవరకు మనతో నిలబడతాయో తెలిసింది. మన సైన్యం, రాజకీయ నాయకత్వం ఇచ్చిన ప్రతిస్పందన దేశ సంకల్పాన్ని ప్రతిబింబించింది” అన్నారు. దేశ భద్రతా సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

మోహన్‌ భాగవత్‌ తాజా వ్యాఖ్యలు పీవోకేలో జరుగుతున్న ప్రజా నిరసనలకు ప్రతిధ్వనిగా మారాయి. వీటితో “పీవోకే భారత్‌లో అంతర్భాగమే” అన్న వాదన మరోసారి గట్టిగా తెరపైకి వచ్చింది.