ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో బీజేపీ అభ్యర్థిగా మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మోదీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
హాజరైన ఎన్డీఏ సీఎంలు..ముఖ్య నేతలు
విధాత : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో బీజేపీ అభ్యర్థిగా మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మోదీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. 2014, 2019లోక్సభ ఎన్నికల్లోనూ మోదీ వారణాసి నుంచి పోటీ చేసి గెలుపొందగా, వరుసగా మూడోసారి ఆయన ఇక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ దాఖలుకు ముందు మోదీ గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆయన గంగా హారతి నిర్వహించారు.
దశాశ్వమేథ ఘాట్లో పూజలు నిర్వహించిన తర్వాత.. ప్రధాని మోదీ ప్రత్యేక క్రూయిజ్ బోట్లో విహరించారు . సోమవారం వారణాసిలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్తో కలిసి ప్రధాని ఆరుగంటల పాటు రోడ్ షో నిర్వహించారు. రాత్రి ప్రధాని మోదీ .. కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. కాగా మంగళవారం మోదీ నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్య నేతలు, బీజేపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. వారణాసిలో జూన్ 1న ఏడో దశలో పోలింగ్ జరుగనుంది.