ఇది సినిమాను తలపించే ఘటన. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునేందుకు ఓ రిమాండ్ ఖైదీ యత్నించాడు.
చండీఘర్ : ఇది సినిమాను తలపించే ఘటన. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునేందుకు ఓ రిమాండ్ ఖైదీ యత్నించాడు. కానీ అతన్ని ఏఎస్ఐ వెంటాడి పట్టుకున్నాడు. ఆ తర్వాత గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన పంజాబ్లోని అమృత్సర్లో జనవరి 18న చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం అమృత్సర్లోని సివిల్ హాస్పిటల్కు పోలీసులు తరలించారు. ఈ క్రమంలో ఖైదీ తప్పించుకునేందుకు యత్నించాడు. నడిరోడ్డుపై పోలీసుల నుంచి తప్పించుకున్న ఖైదీ పరుగెత్తాడు. దీంతో అతన్ని వెంబడించి పట్టుకున్నాడు ఏఎస్ఐ. అనంతరం ఆటోలో ఎక్కించుకుని జైలుకు బయల్దేరారు. ఈ క్రమంలోనే ఏఎస్ఐ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించే లోగా ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు.
హర్యానాలో ఇలాంటి ఘటనే..
హర్యానాలో అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న తన భర్తను పోలీసుల పహారా నుంచి ఓ మహిళ తప్పించిన సంగతి తెలిసిందే. పోలీసుల కళ్లుగప్పి భర్తను స్కూటీపై తీసుకెళ్లింది. అయితే హత్యాయత్నం కేసులో అనిల్ను కోర్టులో హాజరు పరిచేందుకు నలుగురు పోలీసుల బృందం హర్యానా కోర్టుకు తరలించింది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ అనిల్కు కాపలాగా ఉన్నారు.
అయితే అనిల్ను కోర్టుకు తరలిస్తున్న విషయం అతని భార్యకు తెలిసింది. దీంతో తన స్కూటీపై కోర్టు సమీపంలోకి వచ్చింది. అక్కడ చాకచక్యంగా వ్యవహరించిన ఆమె భర్త అనిల్ను ఎస్కేప్ చేసింది. అనిల్తో పాటు ఆయన భార్య ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్పై పోలీసులు కేసు నమోదు చేశారు.